ఆశలపై నీళ్లు చల్లిన విజయశాంతి!

NAGARJUNA NAKKA

సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి నటించే సినిమాపై ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే వీళ్ల ఆశలపై లేడీ సూపర్ స్టార్ నీళ్లు చల్లింది. ప్రజా జీవన పోరాటంలోనే నా ప్రయాణం అంటూనే.. ఇప్పట్లో మరో సినిమా చేయనని చెప్పేయటంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. 

 

సినిమాల్లో నటించాలన్న ఆసక్తి లేకపోయినా.. మూడేళ్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి వెంటపడి మరీ ఆమెను ఒప్పించాడు. సరిలేరు నీకెవ్వరు కథ విన్న తర్వాత నటించనని చెప్పలేకపోయిన లేడీ సూపర్ స్టార్ 13ఏళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ తో రీ ఎంట్రీ జరిగినా.. ఆఫర్స్ వెల్లువలా వస్తున్నా.. సినిమాలకు మళ్లీ దూరమైంది విజయశాంతి. 

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి నటించే సినిమా ఏంటి..? మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోందంటూ వార్తలొచ్చాయి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ లేడీ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు, అనిల్ రావిపూడిలతో పాటు తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాజీవన పోరాటంలోనే తన ప్రయాణమని వెల్లడించారు. మళ్లీ సినిమాల్లో నటించే సమయం వస్తుందో.. లేదో తెలియదని.. ఇప్పటికి ఇక సెలవని విజయశాంతి పేర్కొన్నారు. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. కిలాడి కృష్ణుడు నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు తనకు గౌరవాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. మనసు నిండి మీ ఆదరణకు, నా ప్రాణ ప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు. ఇక ప్రజాజీవన పోరాటంలో నా ప్రయాణమన్నారు విజయశాంతి. ఈ లెక్కన ఇప్పట్లో నటించనని.. తన దగ్గరకు కథలతో రావొద్దని చెప్పకనే చెప్పింది. మొత్తానికి విజయశాంతి అభిమానుల్లో నిరాశనే మిగిల్చింది. 13ఏళ్ల తర్వాత నటించి.. మళ్లీ యాక్టింగ్ కు స్వస్తి చెప్పాలని డిసైడ్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: