అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కాఫీ విత్ కరణ్ టీవీ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు.. బీసీసీఐ అంబుడ్స్మన్ డీఎకే జైన్ జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తీవ్ర విమర్శలను ఎదుర్కోవడమే కాక, కొన్ని రోజుల పాటు బీసీసీఐ బహిష్కరణకు కూడా గురయ్యారు.ఆ ఇద్దరు ప్లేయర్లకు ఒక్కొక్కరికి 20 లక్షల జరిమానా విధించారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పది మంది పారామిలిటరీ కానిస్టేబుళ్ల భార్యలకు చెరొకరు ఒక్కొక్క లక్ష చొప్పున ఇవ్వాలని అంబుడ్స్మన్ ఆదేశించారు.
పాండ్యా, రాహుల్ లకు జరిమానా విధించిన ఆర్డరును బీసీసీఐ తన అధికార వెబ్ సైట్ లో ఉంచింది. ఈ ఆర్డర్ లో వీరిద్దరిపై తదుపరి చర్యలు ఏమీ ఉండబోవని డీకే జైన్ తెలిపారు.అలాగే బ్లైండ్ క్రికెట్ సంఘానికి కూడా ఇద్దరూ చెరో పది లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఆదేశించిన నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించకుంటే.. ఆ ప్లేయర్ల మ్యాచ్ ఫీజు నుంచి బీసీసీఐ ఆ సొమ్మును తీసుకుంటుందని జస్టిస్ జైన్ తెలిపారు. టీవీ వ్యాఖ్యల పట్ల ఇద్దరూ క్షమాపణలు చెప్పారని, వారికి విధించిన శిక్షను కూడా వారు అంగీకరించారని జైన్ తెలిపారు.
ఆస్ట్రేలియా టూర్ నుంచి అర్ధాంతరంగా వెనక్కి పంపడం వల్ల ఇద్దరు ప్లేయర్లు సుమారు 30 లక్షల ఆదాయాన్ని కోల్పోయినట్లు అంబుడ్స్మన్ తెలిపారు. ఐపీఎల్ 2019 సీజన్లో ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ టీమ్కి హార్దిక్ పాండ్యా ఆడుతుండగా.. కేఎల్ రాహుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్కి ఓపెనర్గా ఆడుతున్నాడు.