టీం ఇండియాలో డమ్మీ వాల్‌...పూజరాను అడుకుంటున్నారుగా !

Veldandi Saikiran
టీమిండియా నయావాల్ గా పేరొందిన టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ లో గత రెండేళ్ల నుండి పూర్తిగా వైఫల్యం చెందుతున్నాడు. అయిన అతడిని సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఎంపిక చేసారు భారత సెలక్టర్లు. అయితే నిన్న సౌత్ ఆఫ్రికా తో ప్రారంభమైన మొదటి టెస్ట్ కోసం తుది జట్టులో స్థానం సంపాదించుకున్న పుజారా దారుణంగా విఫలమయ్యాడు. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌ లో గోల్డెన్ డక్‌ గా వెనుదిరిగాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా.. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే క్యాచ్ ఔట్‌ గా పెవిలియన్ చేరుకున్నాడు. అయితే పుజారా వరుస వైఫల్యాలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుత టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తర్వాత నయావాల్‌ గా గుర్తింపు పొందిన పుజారా.. వరుసగా విఫలమవుతున్నాడు. నయావాల్ పుజారాను డమ్మీ వాల్‌ గా పిలుస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. డమ్మీ వాల్‌ డకౌటయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు అవకాశం ఇస్తున్నారని, ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను కాదని, పుజారాకి అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు పుజారా ఇంకా జట్టులో ఎందుకు ఉన్నాడని, గత కొన్ని నెలలుగా అతను తీవ్రంగా సతమతమవుతున్నాడని, అతని స్థానంలో విహారీ లేదా శ్రేయస్ అయ్యార్‌ను ఆడించవచ్చు కదా... అని ప్రశ్నిస్తున్నారు.
సౌత్ ఆఫ్రికా లో భారత ఏ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన హనుమ విహారిని,  ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో సెంచరీతో ఆకట్టుకుని అయ్యర్‌ ను బెంచ్‌ పై కూర్చోబెట్టి.. వరుసగా విఫలమవుతున్న పుజారాకు అవకాశం ఇవ్వడం ఏంటి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే అదే జట్టులో లుంగి ఎంగిడి కూడా ఉన్నాడు. దాంతో ఐపీఎల్ కోసం చేస్తున్న ప్రాక్టీస్ లో పుజారా బలహీనతను లుంగి ఎంగిడి పసిగట్టాడని కామెంట్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: