ఇటీవల వరుసగా గాయాల బారిన పడుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను మరో సారి గాయం వెంటాడింది. న్యూజిలాండ్ తో రెండో టెస్టు కు ముందు ప్రాక్టీస్ చేస్తున్న సందర్భం లో పృథ్వీ షా పాదానికి గాయం అయినట్లు సమాచారం. దాంతో అతను నేడు ప్రాక్టీస్ దూరమయ్యాడు. రేపటి లోగా ఈ గాయం తీవ్రత విషయం లో స్పష్టత రానుంది. ఒకవేళ గాయం ఇబ్బంది పెడితే ఈనెల 29నుండి జరిగే రెండో టెస్టుకు పృథ్వీ దూరం కానున్నాడు. దాంతో అతని స్థానం లో శుభమాన్ గిల్ తుది జట్టులోకి రానున్నాడు. గత కొంత కాలంగా వరస టెస్టు సిరీస్ లకు ఎంపికవుతున్నా గిల్ బేంచ్ కే పరిమితం అవుతున్నాడు. మరి ఈ సారైనా ఛాన్స్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.
ఇక న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఫెయిల్ అయిన పృథ్వీ షా తాజాగా జరిగిన మొదటి టెస్టు లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై విమర్శలు ఎక్కువతున్నాయి. ఇదిలావుంటే రెండో టెస్టు లో కూడా టీమిండియా కు పేస్ కష్టాలు తప్పలాలేవు. మొదటి మ్యాచ్ కు దూరమైన కివీస్ స్టార్ బౌలర్ నీల్ వాగ్నెర్ రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు దాంతో టీమిండియా బ్యాట్స్ మెన్లు, వాగ్నెర్ ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.