హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్షాకాలంలో అయితే...నరకానికి నకలు అన్నట్లుగా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులను అనుభవించని నగర జీవులు, పరిష్కారం కోరని ప్రజానికం ఎవరూ ఉండరు. అయితే. దీనిపై మాజీ మున్సిపల్శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేతలు సహకరించకపోవడం వల్లే...ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో నేతల డబుల్ స్టాండర్డ్స్, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల గురించి కేటీఆర్ వివరించారు. `నేను మున్సిపల్శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది..ట్రాఫిక్జాములవుతున్నాయి.. గంటలు గంటలు రోడ్లమీద ఇరుక్కుపోతున్నామని చాలామంది మిత్రులు నాతో చెప్పేవారు. ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాం. మసీదులు, దేవాలయాలు రోడ్లమధ్యనే ఉంటాయి. ఆయా మతపెద్దలతో మాట్లాడుదామని అనుకున్నా. ముందుగా రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడాలని అధికారులు సూచించారు. దీంతో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల నాయకులతో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడినప్పుడు అందరూ వాటిని తొలిగించడానికి అంగీకరించారు`` అంటూ ఆ తర్వాతి అసలు ట్విస్ట్ వెల్లడించారు.
``ఫోన్లో మాట్లాడిన నేతలతో వ్యక్తిగతంగా కలిసి ముందుగా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదలుపెడుదాం అని అన్నాను. కానీ వారు అభ్యంతరంపెట్టారు. ఫలానా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టాలని సూచించారు. దీంతో వారికి ఆయా ప్రార్థన మందిరాలు తొలిగించాలనే ఉద్దేశం లేదని.. ట్రాఫిక్ సమస్య అలాగే ఉండటమే కావాలని భావిస్తున్నట్లు అర్థమైంది.`` అంటూ అసలు గుట్టును విప్పారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చర్యలను కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. ``ఏ ఉద్దేశంతో తెలంగాణ సాధించుకున్నామో.. ఆ ఉద్దేశం సఫలమైందా.. కాలేదా..? నీళ్లు, నిధులు, నియామకాలు.. మేం అన్ని గొప్పగా చేస్తున్నామనేమాట నేను చెపుతా. కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. వాటిని ఎత్తిచూపండి. అన్నివర్గాలను ఏకకాలంలో సంతృప్తిపరచకపోవచ్చు. పేదప్రజలు గౌరవించుకునే గొప్ప సంప్రదాయానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. `` అని వెల్లడించారు.