ఏపీకి మరో భారీ పరిశ్రమ.. బాబూ వెరీ గుడ్..
ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. ఈమేరకు విస్కాస్ ఫైబర్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ముందుకొచ్చింది. ఏపీ భారీ పరిశ్రమ నెలకొల్పాలని ఆ గ్రూపు సంకల్పిస్తోంది..ఇప్పటికే ఆదిత్య బిర్లా గ్రూపు ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై పరిశ్రమ స్థాపన విషయం గురించి చర్చించారు.
ఈ పరిశ్రమ నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అధికారులు ఈ విషయం సీఎంకు వివరించడంతో ఆ భూములు చూసి రావాలని ఆదిత్య బిర్లా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తే 24 నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటున్నారు బిర్లా గ్రూపు ప్రతినిధులు.
ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా ఆదిత్యా బిర్లా గ్రూపు నార తయారు చేసే పరిశ్రమ నెలకొల్పుతుంది. దీన్ని వస్త్ర ఉత్పత్తి రంగంలో ఉపయోగిస్తారు. ఆదిత్యా బిర్లా గ్రూపునకు ఈ రంగంలో దాదాపు 70 ఏళ్ల అనుభవం ఉండటం విశేషం. టెక్స్టైల్ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న ఆదిత్యా బిర్లా గ్రూపునకు ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా సంస్థలు చెయిన్ పార్టనర్లుగా ఉన్నాయి.