నిమ్మగడ్డకే కుర్చీ ?
ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం ఉంది. ఆయన్ని తొలగించిన విధానం బాలేదని అంతా అంటున్నారు. ఆఖరుకు మాజీ ఎంపీ వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే మాట అన్నారు. ఎన్నికల సంఘంతోనూ, న్యాయ స్థానాలతో గొడవలు ఎందుకు జగన్ అంటూ ఆయన సూటిగానే ప్రశ్నించారు.
జగన్ కి సూపర్ మెజారిటీ వచ్చిందని, ఆయన చేయాల్సిన పని ప్రజల కోసమే ఉండాలని కూడా ఉండవల్లి హితవు పలికారు. మరో వైపు చూసుకుంటే కోర్టులు సైతం నిమ్మగడ్డ విషయంలో సానుకూలంగా ఉన్నాయి. హైకోర్టు ఈ సరికే నిమ్మగడ్డను తొలగించిన విధానం తప్పు అని తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన్ని తిరిగి ఎన్నికల అధికారిగా నియమించడానికి అవకాశం ఏర్పడింది. మరో వైపు చూసుకుంటే సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దు అని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పు మరి కొద్ది రోజుల్లో ఈ కేసు విషయంలో రావచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైసీపీ పంతాలకు పోకుండా అయనకే తిరిగి పదవి అప్పగించాలని సూచనలు కూడా ఉన్నాయి. మేధావులు ఇదే మాట అంటున్నారు. నిజానికి నిమ్మగడ్డ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 31 తో ముగిసిపోతుంది.
దాంతో ఆయన తరువాత ఎటూ ఎన్నికల సంస్కరణలు జరిపి కొత్త వారిని ఆ సీట్లో కూర్చోబెట్టుకునే వెసులుబాటు జగన్ సర్కార్ కి ఉంది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉన్నా ముఖ్యమంత్రిగా జగన్ అధికారాలకు వచ్చిన ముప్పు ఏదీ లేదు. ఇదే విషయాన్ని ఉండవల్లి కూడా అంటున్నారు. మరో వైపు వైసీపీకి జనాదరణ బాగా ఉంది. అందువల్ల ఆయనకే స్థానిక ఎన్నికల్లో జనం పట్టం కడతారు. అపుడు నిమ్మగడ్డ ఉన్నా మరెవరు ఉన్నా కూడా చేసేది ఏమీ ఉండదు, నిమ్మగడ్డను ఆ పదవిలో కూర్చోబెడితే ఎన్నికల వేళ టీడీపీ నుంచి కూడా అభ్యంతరాలు ఉండవు.
స్థానిక ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా కూడా ఫలానా కారణాల చేత మేము ఓడిపోయామని ఎన్నికల సంఘాన్ని కూడా ఆడిపోసుకునే అవకాశాలు టీడీపీకి పూర్తిగా మూసుకుపోతాయి. అందువల్ల ఉండవల్లికే పీఠం ఇచ్చి సజావుగా ఎన్నికలు జరిపించుకోవడమే సరైన వ్యూహమని, అదే ఇపుడు బెటర్ అంటున్నారు. మరి పంతాలకు పోకుండా వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందా. చూడాలి.