రాజధానిని మరో నందిగ్రామ్ చేస్తారా ?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు పై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు . అమరావతి ని కాపాడుకునేందుకు రైతులు శాంతియుతంగా చేస్తోన్న ఉద్యమాన్ని పోలీసు బలగాలతో రెచ్చగొట్టేందుకే , చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు . అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద జాక్ నేతల బస్సు యాత్రను ప్రారంభించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లు ప్రారంభించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అరెస్టు చేశారు .
చంద్రబాబు తో సహా టీడీపీ నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . మాజీ మంత్రులు నారా లోకేష్ , అచ్చెన్నాయుడు , దేవినేని ఉమామహేశ్వర్ రావు , ఎమ్మెల్యే రామానాయుడు , ఎమ్మెల్సీ అశోక్ బాబు లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ... శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతారా ? అంటూ ప్రశ్నించారు . అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులని భయబ్రాంతులకు గురి చేస్తూ , మహిళలను , వృద్ధులను పోలీసు స్టేషన్ కు తరలించడాన్ని జనసేనాని తీవ్రంగా తప్పుపట్టారు .
రాజధాని ప్రాంతం లో రెండు , మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చెగొట్టే విధంగా ఉన్నాయన్న పవన్ కళ్యాణ్ , రాష్ట్రం లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తెర దించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు . అరెస్టులు , నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే , ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని పవన్ హెచ్చరించారు . రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్ గా మార్చాలని ప్రయత్నిస్తుందా ? అంటూ ప్రశ్నించిన పవన్ , ఇలాంటి చర్యలను తక్షణం మానుకుని రాజధాని విషయం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు .