కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం రోడ్డెక్కింది. ఇక్కడ నాయకుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి విభేదాలు తారస్థాయికి చేరుకుని రోడడ్డెక్కలా చేశాయి. తాజాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ ఎం డీఫరూక్కు, నంధ్యాలలో ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బ్రహ్మానందరెడ్డికి మధ్య ఇప్పుడు వివాదాలు చోటు చేసుకుం టున్నారు. దీంతో పార్టీ పరువు బజారున పడుతోంది. విషయంలోకి వెళ్తే.. మంత్రి ఫరూక్, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు– కడప జాతీయ రహదారిపై ఉన్న వక్ఫ్బోర్డు స్థలాల వివాదం వీరిమధ్య విభేదాలను పెంచాయి.
ఈ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నంద్యాల తాలూకా పోలీసులు టీడీపీ కౌన్సిలర్తో పాటు మరో ఐదుగురిపై కేసు కట్టడంతో భూమా వర్గం భగ్గుమంటోంది. మూడు రోజుల క్రితం మంత్రి ఫరూక్ తనయుడు వక్ఫ్బోర్డు స్థలాల వద్దకు వెళ్లడంతో అక్కడ స్థానికులు అడ్డుకొని మీరెన్ని భూములు ఆక్రమించారో అందరికీ తెలుసునంటూ పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది. అయితే, ఇది వెనువెంటనే వర్గ పోరుకు దారి తీసింది. రాజకీయంగా తనపై పైచేయి సాధించేందుకు ఫరూక్ తనయుడు ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా పోన్లో విమర్శించారు దీనిని సీరియస్గా తీసుకున్న ఫరూక్ తనయుడు.. తనకు కూడా రాజకీయాలు తెలుసని, తన తండ్రి కూడా ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని అన్నారు.
అక్కడితో ఆగకుండా.. నువ్వు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు. నాకు చెబుతావా? అంటూ ఇరువురూ ఫోన్లోనే మాటల యుద్ధం చేసుకున్నారు. ఇక, ఇక్కడ మైనార్టీ వర్గం అంతా తమ వెంటే ఉందని, మేం వేసిన ఓట్లతోనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావన్న విషయాన్నిమరిచిపోతున్నావని ఫరూక్ తనయుడు దూకుడు పెంచడంతో భూమా వర్గం కూడా అదే రేంజ్లో రెచ్చిపోవాలని ప్రయత్నించింది. అయితే ఇంతలోనే కొందరు సీనియర్లు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. అయితే, ఈ పరిణామాన్ని అటు భూమా వర్గం, ఇటు ఫరూక్ వర్గాలు సీరియస్గానే తీసుకున్నాయి. నిజానికి ఇప్పటికే ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక, ఇప్పుడు నంద్యాలలో పరిస్థితి ఇలా తయారైంది. దీంతో ఇక్కడ చంద్రబాబు దృష్టి పెట్టి పరిస్థితిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.