భారతీ సిమెంట్స్కు అక్రమంగా గనుల లీజులు కట్టబెట్టడం, పెట్టుబడుల ముసుగులో వచ్చిన ముడుపులకు సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ ‘క్విడ్ ప్రో కో’పై సీబీఐ నమోదు చేసిన అభియోగాల ఆధారంగా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. ‘‘ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద వైఎస్ జగన్, ఇతరులపై ఈడీ కేసు నమోదు చేసింది.
జగన్ తనకు చెందిన సండూర్ పవర్, క్లాసిక్ రియల్టీ, సిలికాన్ బిల్డర్స్, సరస్వతి పవర్తోపాటు మరో పది కంపెనీల ద్వారా పెట్టుబడులు, స్థిర, చరాస్తుల కొనుగోలు, థర్డ్ పార్టీ పేమెంట్స్ రూపంలో అక్రమాలకు పాల్పడ్డారని మా విచారణలో స్పష్టమైంది. అంతేకాదు, భారతీ సిమెంట్ సంస్థ నేరమయ పద్ధతుల్లో సున్నపురాయి లీజు పొందింది’’ అని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి పలు స్థిర, చరాస్తులను గుర్తించామని చెప్పింది. మొత్తం రూ.749.10 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసినట్లుగా ప్రకటించింది. హైదరాబాద్లోని ఈడీ జోనల్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్ ఈ ప్రకటన జారీ చేశారు.
హైద్రాబాద్లోని లోటస్పాండ్లో ఉన్న జగన్ ఇంటిని, అదే విధంగా బెంగళూరులోని నివాసాన్ని, మరికొన్ని ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. జగన్కు సంబంధించిన ఈ ఆస్తుల విలువ రూ. 750 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఓపెన్ మార్కెట్లో ఆస్తుల విలువ రూ. 5వేల కోట్లుగా దర్యాప్తులో తేలింది. బెంగళూరులోని మంత్రి వాణిజ్య భవన సముదాయాన్ని కూడా అటాచ్ చేసింది. వివిధ కంపెనీల్లో జగన్, భారతి షేర్లను ఈడీ స్వాధీనపరచుకుంది. మీడియా కేంద్రం కొలువైన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ‘సాక్షి టవర్స్’ను కూడా ఈడీ బుధవారం అటాచ్ చేసింది.
జగన్ సతీమణి భారతి పేరిట ఉన్న ఆస్తులూ, ఫిక్స్డ్ డిపాజిట్లనూ జప్తు చేసింది. భారతి సిమెంట్స్కు రూ. 152 కోట్ల విలువైన సున్నపురాయి గనులను అక్రమంగా కేటాయించినట్టు నిర్ధారణ అయింది. ఈ కారణంగానే జగన్ పేరుతో ఉన్న ఆస్తులన్నీ ఈడీ జప్తు చేసింది. ఈడీ అటాచ్ చేసిన లోటస్పాండ్లోని ఇంట్లోనే ప్రస్తుతం జగన్ ఉంటున్నారు. ఈడీ ఈ ఇంటిని కూడా జప్తు చేయడంతో జగన్ ఆ ఇంటిని ఖాళీ చేేయాల్సిన అవసరం ఉంటుదేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది