హెరాల్డ్ స్మరణ : నీవు వెళ్లిపోయినా మా మనసంతా నువ్వే...
తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే హీరో ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో యువహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో దక్షిణాది దర్శకుల మనసు చూరగొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడి చేత మళ్లీ మెగా ఫోన్ పట్టించిన ఘనుడు. తెలుగు..తమిళంలో మంచి మార్కెట్ ఏర్పడింది. లవర్బాయ్గా...అమ్మాయిల రాకుమారుడిగా..మారాడు. అదే చివరికి ఆ హీరో జీవితం అల్లకల్లోలంగా మారేలా చేసింది... ఇందులో ఆ యువ హీరో చేసిన తప్పిందం ఏం లేదు...అయినా శిక్ష మాత్రం దేవుడు ఆ హీరోకే విధించాడు.. జీవితం సినిమా కాదని...సినిమాలే జీవితం కాదన్న విషయం తెలుసుకోలేక..వెక్కివెక్కి ఏడ్చుకుంటూ ఈ దుర్త లోకం నుంచి వెళ్లిపోయాడు.
ఉదయ్ కిరణ్ జీవితం కూడా ఓ సినిమా కథలాగే ఉంటుంది. అనేక మలుపులున్నాయ్... ఒడిదుడుకులు.. ఆకాశాన్ని వెక్కిరించిన విజయాలున్నాయ్.. పాతాళం కూడా జాలిపడే అపజయాలున్నాయ్... గుండెల్లో కొండంత బాధ ఉన్నా..ఎప్పుడూ ఆ బాధను ఎవరికి పంచుకోలేదు. కనీసం కట్టుకున్న భార్యతో అన్ని విషయాలు పంచుకోలేదు. చివరికి ఒత్తిడికిలోనై..మానసిక వేదనకు గురై...తలుపులు వేసుకుని...ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. సుశాంత్ సింగ్ సూసైడ్కు..ఉదయ్ కిరణ్ జీవితంలోని చాలా సంఘటనలకు సామీప్యత ఉండటం విశేషం. సినిమాల్లో వరుసగా హిట్ల మీద హిట్లు హ్యాట్రిక్ హీరోగా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ జీవితం ఆ తర్వాత కాలంలో అనేక ఒడిదుడుకులకు లోనైంది. టాలీవుడ్లోని ఓ సినీ పెద్ద కుటుంబంతో ఏర్పడిన వివాదం కూడా ఇందుకు ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. ఆ సంఘటన తర్వాతే ఆయనకు తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడం..నిర్మాతలు వెనక్కివెళ్లిపోవడం జరిగిందని ఉదయ్కిరణ్కు సన్నిహితంగా ఉన్న సినిమా ఆర్టిస్టులు చెబుతుంటారు.
ఉదయ్ కిరణ్ జూన్ 26 1980 న హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి, నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్లోని తన ఫ్లాట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ వెండి తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే పెద్ద హిట్లుగా నిలిచాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.