ఆ దర్శకులెవ్వరు నాతో సినిమా చేయాలనుకోవడం లేదు.. అక్షయ్
ప్రస్తుతం అక్షయ్ 'గుడ్ న్యూస్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా ఆడ్వాణీ, కరీనాకపూర్, దిల్జిత్ దొసాంజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో రాజ్ మెహ్తా దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా అక్షయ్ విలేకర్లతో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ.. నాతో అగ్రదర్శకులు సినిమాలు చేయాలనుకోవడం లేదని తెలిపారు. వారు నాతో సినిమాలు చేయాలనుకోవడం లేదు కాబట్టే నేను కొత్త దర్శకులతో పనిచేస్తున్నానన్నారు. ఇది నిజం. బాలీవుడ్లోని కొందరు అగ్రదర్శకులు నాతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేరు. కానీ.. నేను నటించిన కొన్న చిత్రాలను వారు నిర్మిస్తున్నారు. పెద్దవాళ్లు నీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనప్పుడు. నీ ప్రయాణాన్ని నువ్వే ప్రారంభించుకోవాలి. ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం దొరకనప్పుడు ఏదో ఒక చిన్న ఉద్యోగాన్ని చూసుకుని అక్కడి నుంచి నువ్వు అగ్రస్థానానికి చేరాలి. అంతేకానీ, ఇంట్లో కూర్చుని వాళ్లు నీకు ఉద్యోగం ఇవ్వడం లేదని ఆలోచిస్తూ.. బాధపడకూడదు' అని అక్షయ్ తెలిపారు.
ఖాన్ లతోనే సినిమాలు తెరకెక్కించడానికి అగ్రదర్శకులు ఆసక్తి చూపిస్తున్నారా..? అని ఓ విలేకరి అడగగా.. 'సినీ పరిశ్రమలో ఖాన్ మాత్రమే కాదు.. కపూర్స్, ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు. వాళ్ల కథలకు ఏ హీరో సెట్ అవుతారో చూసుకుని వాళ్లతోనే అగ్రదర్శకులు సినిమాలు చేస్తారు. అందుకే వాళ్లు నాతో సినిమాలు చేయడం లేదు. నా మార్గాన్ని నేను ఏర్పాటు చేసుకున్నానని అక్షయ్ పేర్కొన్నారు.
రాజ్ మెహ్తాతో కలిసి పనిచేయడంపై అక్షయ్ మాట్లాడుతూ.. రాజ్ మెహ్తా నా 21వ నూతన దర్శకుడు. ఎందరో పాత దర్శకుల కంటే బాగా సినిమాను తెరకెక్కించాలనే తపన తనలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది తనకు చేయడం లేదా చావడం లాంటిది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే తనకి మరిన్ని ఆఫర్లు వస్తాయి. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే ఇంక అంతే సంగతులు అని అన్నారు.