హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్థికి తిరుగులేనట్లేనా?
తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం..2004 వరకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అడ్డా. ఈ నియోజకవర్గం నుంచి యనమల వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85, 89, 1994, 1999, 2004 లలో వరుసగా టీడీపీ నుంచి గెలిచి, ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసారు. ఆలా తిరుగులేని విజయాలు సాధించిన యనమలకు 2009 ఎన్నికల్లో చెక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట కృష్ణంరాజు, యనమలకు తొలి ఓటమి రుచి చూపించారు.
ఆ ఓటమి దెబ్బకు యనమల ప్రత్యక్ష ఎన్నికల పోటీకి దూరమయ్యారు. ఇక 2014 ఎన్నికలొచ్చేసరికి టీడీపీ టికెట్ యనమల సోదరుడు కృష్ణుడుకు దక్కింది. కానీ కృష్ణుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడం యనమల రామకృష్ణుడు మంత్రిగా పనిచేయడంతో, నియోజకవర్గంలో కృష్ణుడు పెత్తనం చేసారు. అసలు నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ చేసిన అరాచకాల దెబ్బకు విసుగెత్తిపోయిన ప్రజలు, మరోసారి 2019 లో దాడిశెట్టి రాజాని గెలిపించారు.
పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో, రాజా నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎలాంటి పనికైనా డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనుకాడటం లేదు. అటు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందేలా చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గెలిచి సంవత్సరమే కావడం వల్ల నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి పనులు ఏమి జరగలేదు. ఇంకా ఓ న్యూస్ రిపోర్టర్ హత్యకేసులో దాడిశెట్టి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ వన్ సైడ్ విజయం సాధించడం ఖాయం. నియోజకవర్గంలో ఉన్న తుని, కోటనందూరు, తొండంగి మండలాల్లో వైసీపీ హవా బాగా ఉంది. అయితే తునిలో యనమల ఫ్యామిలీ ఉన్నంత కాలం దాడిశెట్టికి తిరుగులేనట్లే అని తెలుస్తోంది. దశాబ్దాల పాటు యనమల ఫ్యామిలీతో విసుగెత్తిపోయిన తుని ప్రజలు, ఫుల్ సపోర్ట్ దాడిశెట్టికి ఇస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ టికెట్ యనమల ఫ్యామిలీకి కాకుండా వేరే లీడర్ కైనా టికెట్ ఇస్తే కొంచెం బెటర్ గా ఉంటుందని, లేదంటే తునిలో టీడీపీ సమాధి కావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే చంద్రబాబు, యనమల ఫ్యామిలీని కాదని వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడం కష్టం. కాబట్టి తునిలో యనమల ఫ్యామిలీ ఉన్నంత వరకు విజయం దాడిశెట్టి రాజాదే.