వావ్.. లాక్డౌన్ దెబ్బకు భారీగా తగ్గిపోయిన ఎమర్జెన్సీ కేసులు..!!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను తన గుప్పెట్లో పెట్టుకుని.. అనేక మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది. అయితే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు దేశదేశాలు ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా.. పలు దేశాలు ప్రజలను బయటకు రాకుండా లాక్డౌన్ విధించాయి. ఈ లాక్డౌన్ కారణంగా కొందరు ప్రజలు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారా అని వెయ్యి కళ్లతో చూస్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ కారణంగా కొంత మంచి జరిగింది అన్నది వాస్తవం. అందులో ముఖ్యంగా హాస్పిటల్స్కు వచ్చే ఎమర్జెన్సీ కేసుల సంఖ్య, మరణాలు కూడా గణనీయంగా తగ్గిపోవడం ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
గుండెపోట్లు, హృద్రోగం సహ ఇతర ఎమర్జెన్సీ కేసుల తగ్గిపోవడం కేవలం ఇండియాలోనే కాకుండా.. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ తక్కువ ఒత్తిడి, కాలుష్యం తగ్గడమూ కూడా కారణమని, మరికొందరు అవసరమైతనే వైద్యు సేవలవైపు చూస్తున్నారని వైద్యులు అంటున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఎమర్జెన్సీ అడ్మిషన్లు అకస్మాత్తుగా 50 నుంచి 60 శాతం మేర పడిపోయినట్టు పలువురు వైద్యులు చర్చించుకుంటున్నారు.
అలాగే లాక్డౌన్ వ్యవధిలో ప్రజలు ఎంతో ఆరోగ్యం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ ఓపీ యాదవ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వైద్యం విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల అమెరికాలో ఏడాదికి 2 లక్షల మంది మరణిస్తారు. భారత్లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అయితే ఇప్పుడు లాక్డౌన్ దెబ్బకు ఇలాంటి మరణాలు గణనీయంగా తగ్గాయి అని ఆయన పేర్కొన్నారు.
ఇక బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రక్తపోటు, డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలతో 2017 మార్చిలో 729 మరణాలు, 2018 మార్చిలో 833, గతేడాది 937 మంది మృతి చెందగా.. ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 595గా ఉంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల ప్రస్తుతం ఇంచు మించు ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఏదేమైనప్పటికీ.. వీరి మాటలు బట్టీ.. లాక్డౌన్ దెబ్బకు ఎమర్జెన్సీ కేసులు, మరణాలు భారీ స్థాయిలో తగ్గాయని చెప్పుకోవచ్చు.