హమ్మయ్య.. జగన్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టేనా?

గత రెండు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశల వారీగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వ పెద్దలను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. అసలు ఎన్నికల సమయం కావడంతో వైసీపీ సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులను మంత్రుల బృందం ఆహ్వానించి చర్చల్లో తమకు రావాల్సిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.

దీంతో ఈ నెల 27న రాష్ట్ర జేఏసీ తల పెట్టిన బీఆర్టీఎస్ మహా ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం ఎన్జీవో హోమ్ లో మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగుల మధ్యంతర భృతి కోసం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్ మేరకు స్పందిస్తూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మధ్యంతర భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించిందన్నారు.

ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.70 కోట్లను, సీపీఎస్ ఉద్యోగులకు టీఏ, డీఏలను నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో రూ.100 కోట్లను వీలైనంత త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం చెప్పిందన్నారు. పెన్షనర్ల డిమాండ్లలో ప్రధాన మైన క్వాంటం ఆఫ్ పెన్షన్ లో మార్పులు చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి.. తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30శాతం జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామన్ని వివరించారు. ఉద్యోగసంఘాల నేతలతో ప్రభుత్వం రాత పూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశతో తమ ఆందోళన తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు 27న తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమానికి హాజరుకాకుండా ముందస్తుగా కొన్ని జిల్లాలో ఉద్యోగ సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: