టోల్ వ్యవస్థ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి...!

FARMANULLA SHAIK
టోల్ ఛార్జీల వసూళ్లపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుపై నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్ వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.మీరు మంచి సేవలు అందించలేనప్పుడు టోల్ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించరు. చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు అందివ్వలేనప్పుడు టోల్ వసూలు చేయకూడదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా తాము ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా చూడాలని నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్లకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నేషనల్ హైవే ఏజెన్సీల ఫీల్డ్ ఆఫీసర్లు టోల్ ప్లాజాల వద్ద జాప్యం వల్ల కలిగే ప్రజల బాధల పట్ల సున్నితంగా ఉండాలని, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే యంత్రాంగాన్ని వాదించాలని గడ్కరీ స్పష్టం చేశారు. రహదారుల పరిస్థితి, టోల్ వసూలు విధానాలపై ప్రయాణికుల్లో పెరుగుతున్న నిరుత్సాహాన్ని మంత్రి వ్యాఖ్యలు ప్రతిబింబించడం గమనార్హం.
మరోవైపు, ఈ ఆర్థిక సంవత్సరంలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీల వసూలు విధానాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. తొలి దశలోనే 5వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.తొలుత కమర్షియల్ వాహనాలకు ఒక లేన్‌లో అనుమతిస్తారు. టోల్ వసూలుకు కీలకమైన వెహికిల్ ట్రాకర్ సిస్టమ్ యూనిట్‌ను ఆయా వాహనాల్లో మార్చాల్సిన ఉంటుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దశలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ విధానంతో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: