డీఎస్సీ నోటిఫికేషన్.. జగన్ ఫేట్ మారుస్తుందా?
మెగా డీఎస్సీ ప్రకటించకుండా కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంటి తుడుపు చర్యగా 6100 ఉద్యోగాలు ప్రకటించారని ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని మండిపడుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఆ తర్వాత దాని ఊసే ఎత్తకుండా జగన్ యువతను మోసం చేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే గ్రామీణ నిరుద్యోగ యువత ఆశించే రెండు ప్రధాన ఉద్యోగాలు ఒకటి పోలీస్ రెండు టీచర్ పోస్టులు. అయితే వీటి భర్తీలో వైసీపీ ప్రభుత్వం కాస్తా ఉదాసీనంగా వ్యవహరించింది అన్న ఆరోపణలున్నాయి.
ఒకేసారి కాకపోయినా జాబ్ ఏడాదికి ఒక ఐదువేల చొప్పున కానిస్టేబుళ్లు, ఐదువేల టీచర్ పోస్టులను భర్తీ చేసినా దాదాపు 50వేల ఉద్యోగాల కల్పన జరిగేది. ఇలా చేస్తే యువత ఆయన్ను జీవిత కాలం గుర్తు పెట్టుకునేది. కానీ అలా జరగలేదు. కానీ ఇటీవల ప్రభుత్వం ఆరువేల పోలీస్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీనిపై నిరుద్యోగ యువత సంతోషంగా లేరు.
దీన్ని టీడీపీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. తమ హయాంలో 10,313 టీచర్ పోస్టుల భర్తీ చేశామని చెప్పుకొంటోంది. దీనికి కౌంటర్ గా వైసీపీ దాదాపు 20వేల టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు లెక్కలు చెబుతోంది. అదెలా అంటే 1998, 2008, 2018లో వివిధ కారణాలతో భర్తీ చేయని పోస్టులతో పాటు బ్యాక్ లాగ్ వాటిని పూర్తి చేయించింది. చంద్రబాబు సమయంలో అలాంటి భర్తీ కానీ బ్యాక్ లాగ్ పోస్టులు 10313 ఉంటే.. మేం వచ్చాక 14219 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుత నోటిఫికేషన్ తో కలిపి మొత్తం 20వేలు అని చెబుతున్నారు.