ఒక్కసారిగా జనసేనకు ఫుల్ డిమాండ్ ఎందుకొచ్చింది?
ఇప్పటికే కొందరు చేరిపోయారు. మరికొందరు చర్చల దశలో ఉన్నారు. టికెట్ల హామీ లభించడమే తరువాయి మరుక్షణమే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే ఆసక్తికర అంశం ఏంటంటే వైసీపీ నుంచి చాలామంది నేతలు ప్రతిపక్ష టీడీపీ చేరేందుకు కాకుండా జనసేనలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఓ సిట్టింగ్ ఎంపీతో పాటు ఇద్దరు మాజీ మంత్రులు పార్టీలో చేరేందుకు రెఢీ అయ్యారు. దీంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరగా.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఆపార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 30న ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి క్యూ కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే వీరందరూ జనసేనను ఎంచుకోవడం వెనుక కారణాలను రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ.. ఏ రాజకీయ నాయకుడు అయినా ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరుకుంటారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ లు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. ఆ పార్టీలకు అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారు. కానీ జనసేన ఇంకా నిర్మాణాత్మకంగా బలపడలేదు. మరోవైపు టీడీపీలో చోటు కూడా లేదు. ఒకవేళ అందులో చేరితే టికెట్ వస్తుందో రాదో కూడా చెప్పలేం. అదే జనసేన అయితే టికెట్ గ్యారంటీ అనే ఆలోచనతోనే పార్టీలోకి చేరుతున్నారని అభిప్రాయపడుతున్నారు.