ఆ జిల్లాలో మరో ఆరుగురికి కరోనా..
తెలంగాణలో కరోనా వైరస్ ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా రూరల్ ఏరియాలో మళ్లీ విజృంభిస్తోంది. మంచిర్యాల జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబై నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముంబై నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధితులను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది. కాగా, రాష్ట్రంలో శుక్రవారం మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు ఉంది. ఇక 19 మంది వలసదారులు ఉన్నారు.
దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,761కి చేరుకుంది. కరోనాతో శుక్రవారం ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 48కి చేరింది. తాజాగా ఏడుగురు కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,043 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారు. వలసదారుల్లో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 118మంది వలసదారులు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.