పాపం ఎమ్మెల్సీ: కరోనా వదిలింది.. పాము కాటేసింది!
పరిస్థితులు చిత్రంగా ఉంటాయి.. ఎప్పుడు ఎవరిపరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం.. తాజాగా.. ముంబైలో ఇలంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా వైరస్ నుంచి కోలుకొని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన శివసేన ఎమ్మెల్సీ .. మరుసటి రోజే పాము కాటుకు గురయ్యారు. దీంతో ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. థానేకి చెందిన శివసేన ఎమ్మెల్సీకి మే 9న వైద్యులు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ములుంద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం మే 15న ఆయనను డిశ్చార్జి చేశారు.
కొద్ది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న వైద్యుల సలహా మేరకు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న తన బంగ్లాలోకి వెళ్లాడు. పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు అందరికీ దూరంగా ఉండేందుకు ఆయన ఆ బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, శనివారం సాయంత్రం ఇంటిముందు కూర్చున్న ఆయనను ఓ విష పూరిత పాము కాటేసింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రసుత్తం ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.