అసెంబ్లీకి వెళ్లాలా వద్దా.. డైలమాలో చంద్రబాబు..?
నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఆవేశానికి గురయ్యారు.. తననే ఇంత మాట అంటారా.. ఇది గౌరవ సభ కాదు.. కౌరవసభ అంటూ ఆవేశపడ్డారు. మళ్లీ సీఎంగానే ఈ సభకు వస్తాను తప్ప.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని శపథం చేశారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు డైలమాలో పడ్డారు. కానీ.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది.
అలాంటి సమయంలో సభలో చంద్రబాబు ఉంటేనే బావుంటుందన్న వాదన పార్టీలో జరుగుతోంది. అయితే శపథం చేసిన తర్వాత మళ్లీ వెనక్కి తగ్గి అసెంబ్లీకి వెళ్తే..ఇక ఆ శపథం విలువ ఏముంటుందన్న వాదన కూడా జరుగుతోంది. దీనిపై ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగే పొలిట్బ్యూరో భేటీ లో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ పొలిట్ బ్యూర్ సమావేశంలో సమీక్షించనున్నారు.
అదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతిపైనా పొలిట్ బ్యూరోలో చర్చించే అవకాశం ఉంది. ఇది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం.. అలాగే.. టీడీపీకి 40ఏళ్లు నిండుతున్న సంవత్సరం కూడా .. ఈ రెండు ఈవెంట్ల విషయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న అంశంపైనా పార్టీలో చర్చించే అవకాశం ఉంది. ఈ వేడుకలను ఎలా జరపాలనే అంశంపై చర్చించనున్నారు.