చింతమనేని ప్రభాకర్: అధికారంలోకి వచ్చినా ఆనందం లేదా? ఎందుకీ అసంతృప్తి?
ముఖ్యంగా మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు మేయర్ కుటుంబం వంటి వారు పార్టీలోకి రావడం, వారికే ప్రాధాన్యత దక్కడం చింతమనేని వర్గీయులను కలవరపెడుతోంది. కష్టపడిన వారికి గుర్తింపు ఎక్కడ? "ఐదేళ్లు కష్టపడి కేసులు మోసింది మేము.. ఇప్పుడు అధికారం రాగానే పీట వేసి కూర్చోబెడుతోంది వారినా?" అన్నది చింతమనేని అంతరంగం. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ నాయకత్వం వైసీపీ నుంచి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేయడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ, కేవలం తన నియోజకవర్గ పరిధిలోని పనులకే పరిమితం అవుతున్నారని తెలుస్తోంది.
సంక్రాంతి పందేల బిజీలో... ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తుండటంతో చింతమనేని తన నియోజకవర్గంలో కోడి పందేల నిర్వహణపై దృష్టి సారించారట. ఏటా ఆయన సంప్రదాయబద్ధంగా వీటిని నిర్వహిస్తుంటారు. రాజకీయాల కంటే ప్రస్తుతానికి పండుగ సందడిపైనే ఆయన ఫోకస్ పెట్టారు. అయితే, లోలోపల మాత్రం అధిష్టానం వ్యవహారశైలిపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని టాక్. చింతమనేని ప్రభాకర్ వంటి ఫైర్ బ్రాండ్ నేత మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాత తరం నాయకులను కాదని, కొత్తగా వచ్చే వారికి పెద్దపీట వేయడం వల్ల కేడర్లో కూడా అసంతృప్తి నెలకొనే ప్రమాదం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ సీనియర్ నేతను ఎలా బుజ్జగిస్తారో చూడాలి.