ఈ మద్య మహిళలపై దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయి..సామాన్య మహిళల నుంచి సెలబ్రెటీల వరకు లైంగిక ఇబ్బందులు, అత్యాచారాలు, హత్యలకు గురి అవుతున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు మమత శర్మ అదృశ్యమై పొలాల్లో శవమై తేలిన ఘటన కలకలం రేపింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ పూర్వికుల గ్రామంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనవరి 14న గొహనాలో కార్యక్రమం ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తర్వాత కనిపించకుండా పోయారు. బాలియాని గ్రామంలోని పొలాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె గొంతు కోసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కల్నౌర్ ప్రాంతవాసి అయిన మమత ప్రముఖ హరియాణావి గాయకురాలిగా సుపరిచితులు.
భజన పాటలు పాడటంలో ఆమె పేరుగాంచారు. మమత అదృశ్యంపై తాము ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గత ఐదు రోజుల్లో ఆరు రేప్ కేసులు, గ్యాంగ్ రేప్ చోటు చేసుకోవడంతో హరియాణా పేరు జాతీయస్థాయిలో పతాక శీర్షికల్లో నిలిచింది. మహిళలపై అఘాయిత్యాలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.