జగన్‌కు సొంత సామాజిక వర్గం దూరమైందా.. వారే దెబ్బ కొట్టారా?

Suma Kallamadi
మనిషికి ఒక అస్తిత్వంలో కులం మారిపోయింది. దేశంలో ప్రతి ప్రాంతంలోనూ అందరి పేర్ల వెనుక కులం పేరు తగిలించి ఉంటుంది. ఇది తమ కులం అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటుంటారు. కులంతోనే చాలా వరకు రాజకీయాలు జరుగుతుంటాయి. కులం బలాన్ని బట్టి ఓట్లు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. ముఖ్యంగా ఏపీలో కుల రాజకీయాలు బాగా పెరిగాయి. వైఎస్ జగన్‌కు పార్టీ పెట్టినప్పటి నుంచి సొంత కులమైన రెడ్లు అండగా నిలబడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం వారే ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఆయన 68 సీట్లతో తొలుత ప్రతిపక్షంలోనూ తర్వాత 151 సీట్లతో అధికారం చేపట్టడానికి వారే కారణం అయ్యారు. అంతలా ఆయనను అక్కున చేర్చుకున్న రెడ్లు ప్రస్తుతం వైఎస్ జగన్‌కు దూరం అయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీనికి జగన్ స్వయంకృతాపరాధమే కారణమనే వాదన వినిపిస్తోంది. అందువల్లే జగన్ 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఏపీలో సుమారు 70 నియోజకవర్గాల్లో రెడ్ల ప్రాబల్యం ఉంది. అక్కడ వారు రాజకీయాలను బాగా శాసిస్తున్నారు. ఆర్థికంగా బలమైన ఆ సామాజిక వర్గమే జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. సొంత సామాజికవర్గం కావడంతో ఆయనను అక్కున చేర్చుకుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసమీకరణకు, సభలకు, ఆయన పాదయాత్ర సమయంలోనూ రెడ్లు భారీగా డబ్బులు ఖర్చు చేశారు. చాలా చోట్ల ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు నిలబడ్డప్పుడు సైతం వారే వెన్నుదన్నుగా నిలిచి, తమ సొంత డబ్బులు రాజకీయాల కోసం ఖర్చు చేశారు. అలాంటి వారిని అధికారంలోకి వచ్చాక జగన్ పక్కన పెట్టారు.

సామాజిక న్యాయం పేరుతో రెడ్లకు కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టారు. ఇదే కాకుండా కాంట్రాక్టర్లుగా ఉన్న చాలా మంది రెడ్లకు బిల్లులు సమయానికి అందలేదు. దీంతో వైసీపీకి బలమైన సపోర్ట్‌గా నిలిచిన చాలా మంది రెడ్లు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. వీరంతా ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. కమ్మ కులాన్ని తనను వేరుగా చంద్రబాబు ఎప్పుడూ చూడలేదు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత పవన్ సైతం తమ సామాజిక వర్గ అవసరాన్ని గుర్తెరిగారు. ఫలితంగా గోదావరి జిల్లాల్లో భారీ మెజార్టీ వచ్చింది. అయితే జగన్ నేల విడిచి సాము చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని అంతా భావిస్తున్నారు. మంత్రి వర్గంలో రెడ్లకు సరైన ప్రాతినిథ్యం దక్క లేదని, అంతేకాకుండా ఎన్నో పదవుల్లో సామాజిక న్యాయం పేరుతో వారిని పక్కన పెట్టారని తెలుస్తోంది. అదే ఆయన ఓటమికి బలమైన కారణంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: