ఉత్తరాంధ్ర: టీడీపీ ఎంపీ హ్యాట్రిక్ ఆశలకి క్రాస్ ఓట్ల ముప్పు?

Purushottham Vinay
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఎంపీ సీటు అనేది టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎక్కువ సార్లు గెలిచిన సీటు అది. ఇక టీడీపీ మొత్తం రాజకీయ చరిత్రలో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి ఒక్క కింజరాపు కుటుంబమే దాదాపుగా పాతిక సంవత్సరాల పాటు గెలిచింది. పాలించింది. మొదట దివంగత నేత ఎర్రన్నాయుడు ఎంపీగా దాదాపుగా దశాబ్దన్నర పాటు పనిచేయగా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు రెండు దఫాలుగా పది సంవత్సరాల పాటు పనిచేశారు.ఆయన 2014 వ సంవత్సరంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలిచి 2019లో కూడా మరోసారి గెలిచారు. ఈ 2024లో గెలిస్తే హ్యాట్రిక్ ఎంపీ అవుతారు. అయితే ఈసారి ఆయనకు కొన్ని రాజకీయ సమీకరణలు చాలా ఇబ్బందిగా మారాయని సమాచారం తెలుస్తుంది. పాతపట్నం, శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లను పాత కాపులకు కాకుండా కొత్త వారికి టీడీపీ ఇచ్చింది. దీని వెనక ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు.దాంతో రెబెల్స్ కోప్పడారు. నిరసనలు కూడా చేశారు. అయితే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణను బుజ్జగించి జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చారు. దాంతో ఆయన కొంచెం శాంతించినా కానీ పాతపట్నం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్ధికి పనిచేయలేదన్న విమర్శలు ఉన్నాయి. పోలింగ్ చూస్తే వైసీపీ అభ్యర్ధి రెడ్డి శాంతికి టీడీపీ ఓట్లు క్రాస్ అయ్యాయని అంటున్నారు. మరి ఎంపీ ఓట్లు ఎటు పోయాయన్నది ఇక్కడ ప్రశ్న. ఎంపీకి రామ్మోహన్ కే ఓట్లు వేయాలని నిర్ణయించినా కలమట వర్గం మాత్రం అసహనంతో ఉందని దాంతో వారు క్రాస్ ఓట్లు వేసి ఉంటారని తెలుస్తుంది. దాంతో పాతపట్నం ఓట్లు ఎంపీకి ఎన్ని పడతాయన్నది చర్చగా ఉంది. 


ఇక శ్రీకాకుళంలో  మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి ఈసారి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారన్న బాధతో ఆయన అనుచర వర్గం కోపంగా వైసీపీకి వేసిందని అంటున్నారు. పోలింగ్ చూస్తే వైసీపీ అభ్యర్ధి ధర్మాన ప్రసాదరావుకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది.రామ్మోహన్ కి కాకుండా కూడా వైసీపీ అభ్యర్థి పేడాడ తిలక్ కి క్రాస్ ఓట్ చేశారు అని కూడా అంటున్నారు. అందువల్ల రెండు కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్ని ఓట్లు టీడీపీ ఎంపీకి పడతాయన్నది చర్చగా మారింది. అయితే వైసీపీ నుంచి టీడీపీ ఎంపీకి అంతే లెవెల్ లో క్రాస్ ఓట్ జరిగింది. ఎప్పటి లానే ధర్మాన కింజరాపు కుటుంబాల మధ్య ఉన్న లోపాయికారీ అవగాహనతో శ్రీకాకుళం నరసన్నపేటల నుంచి టీడీపీ ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని అలాగే మరికొన్ని చోట్ల కూడా రామ్మోహన్ కి అనుకూలంగా వైసీపీ నుంచి భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది.దీంతో సొంత పార్టీ ఓట్లు అవతలకు పడి ప్రత్యర్ధి పార్టీల ఓట్లు ఇవతలకు వచ్చిన క్రమంలో ఎవరు గెలుస్తారన్నది పెద్ద ప్రశ్న. ఎలాగైనా హ్యాట్రిక్ ఎంపీగా గెలిచి నిలవాలని రామ్మోహన్ చూస్తున్నారు. అయితే ఈసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన పేడాడ తిలక్ ని ఎంపీగా చేయాలని జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గం పార్టీలకు అతీతంగా పనిచేసిందని తెలుస్తుంది. ఫలితం ఎలా ఉండబోతోందన్నది జూన్ 4న చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: