ఏపీ: వైసీపీకి నమ్మకద్రోహం చేసిన నాయకులు వీరే?
ఎన్నికలు దగ్గరవుతుండడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎలక్షన్లలో కూడా విజయ బావుటా ఎగరవేయాలని రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేస్తుంటే కొందరు నేతలు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాసి, ఆ లేఖను శాసన మండలికి పంపారు. ఇతనిని ఒకప్పుడు టీడీపీ నిర్లక్ష్యం చేస్తే జగన్ అక్కున చేర్చుకున్న సంగతి విదితమే. మరో రెండ్రోజుల్లో ఈయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. అదే విధంగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురించి అందరికీ తెలిసినదే. ప్రస్తుతం అతగాడు టీడీపీలో చేరాడు.
ఈ కోవకే చెందుతారు రామ చంద్రయ్య, కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మరియు ఉండవల్లి శ్రీదేవి. ఒకప్పుడు కనీసం వీరంటూ ఒకరు ఉన్నారనే గుర్తింపు వారికి టీడీపీ ఇవ్వలేదనే విషయం విదితమే. కాగా అటువంటి వారికి వైస్సార్సీపీ పార్టీ పట్టం గడితే ఇపుడు కాదన్న టీడీపీ పక్కన చేరారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు. విషయం ఏమిటంటే దాదాపు అందరూ అధికార దాహంతోనే ఇపుడు ప్రతిపక్షం పంచన చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జండా ఎగురుతుందనే ధీమా వారిలో ఉండడం వల్లనే ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.