ఏపీ: టీడీపీ హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగింది: టీజీ భరత్‌

Suma Kallamadi
టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ముస్లింల అభివృద్ధి అనేది జరిగిందని కర్నూలు పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ తాజాగా ఓ మీడియా సమావేశంలో అన్నారు. నిన్న గురువారం నగరంలోని 6వ వార్డులోని గడ్డవీధిలో జనసేన కర్నూలు ఇన్‌చార్జి ఆర్షద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విందులో ఎంపీ ఆభ్యర్థి బస్తిపాటి నాగరాజు, జనసేన పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్హంఖాన్‌తో కలిసి టీజీ భరత్‌ పాల్గోవడం విశేషం. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ.. "తెలుగుదేశం పార్టీ ఆధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు పెద్ద పీట వేసింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో మీరు చూసుకుంటే మసీదుల అభివృద్ధికి మేము కోట్లాది రూపాయలు ఖర్చు చేసాము. ఈ ఐదేళ్ల పాలనలో మసీదులకు వైసీపీ ఏం చేసిందో చెప్పగలరా?" అని అన్నారు.
అదేవిధంగా 2018లో కర్నూలులో ఇస్తేమా నిర్వహించినప్పుడు రూ.10 కోట్లు మేర నిధులు టీడీపీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ముస్లింలకు రంజాన్‌ తోఫాను, పండగ బాహాటంగా అట్టహాసంగా జరుపుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్ర మాలన్నీ టీడీపీ, బీజేపీ పోత్తులో ఉన్నప్పుడే జరిగాయని గుర్తుపెట్టుకోవాలి సూచించారు. కేవలం ఎన్నికల ముందుకు బీజేపీతో టీడీపీ పొత్తు ఉండదని, టీడీపీని గెలిపిస్తే ముస్లింలు నష్టపోతారని అసత్య ప్రచారాలు చేసే వైసీపీ నాయకులు వ్యాఖ్యలు అస్సలు నమ్మ వద్దని ఈ సందర్భంగా వారికి సూచించారు.
కాగా ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ బాషా, మహబూబ్‌ బాషా, హమీద్‌, ఇబ్రహిం, జనసేన కార్యకర్తలు, బూత్‌ ఇన్‌చార్జిలు ఇంకా అనేకమంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే నగరం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కర్నూలు పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ చెప్పుకొచ్చారు. నగరంలో యువతకు అవసరమైన ఉపాధి అవకాశాలకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నానని, అలాగే మహిళలు, కార్మికులు, దుకాణాల్లో పని చేసే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు టీడీపీ చర్యలు చేపడుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా మాటిచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత నష్టపోయామో పరిస్థితులు ఒక సారి గుర్తు చేసుకోమని వారికి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: