అమరావతి : చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya



పాార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. టికెట్లు ఫైనల్ చేయటానికి సమయం సరిపోవటంలేదు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఫైనల్ చేసి ప్రచారం కూడా చేసేస్తున్నారు. సిద్ధం పేరుతో ఎన్నికల మూడు ప్రచారసభల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేనన మధ్య సీట్ల సర్దుబాటే పూర్తికాలేదు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినంత ఈజీగా సీట్ల సర్దుబాటు కావటంలేదు.



ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సీట్లలో కూడా టీడీపీ అభ్యర్ధులు పోటీకి దిగుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన తరపున కందుల దుర్గేష్ పోటీచేస్తారని పవన్ ప్రకటించారు. అయితే ఇపుడాసీటులో టీడీపీ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరే పోటీచేయబోతున్నారట. అందుకనే కందులను పవన్ నిడదవోలులో పోటీచేయమని అడిగారు. అయితే అక్కడి తమ్ముళ్ళు  కందులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొత్తపేట, పీ గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కాదు జనసేన అభ్యర్ధులే పోటీచేయాలని జనసేన నేతలు గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు.



అలాగే టీడీపీ పోటీచేసే నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధులను మార్చాల్సిందే మిగిలిన తమ్ముళ్ళు చంద్రబాబుపైన బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి అయోమయాలు రెండుపార్టీల్లోను బాగా పెరిగిపోతోంది. కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం లాంటి చోట్ల గడచిన మూడేళ్ళుగా అభ్యర్ధుల హోదాలో పనిచేసుకుంటున్న సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని కూడా మార్చేసి కొత్తవారికి చంద్రబాబు టికెట్లిచ్చారు. మూడేళ్ళ క్రిందట సుబ్బారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిందే చంద్రబాబు.



చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలే పెరిగిపోతున్నాయి. మధ్యలో బీజేపీ పొత్తులో కలుస్తుందో కలవదో అనే విషయమై అయోమయం పెరిగిపోతోంది. ఇచ్చిన టికెట్లపై గొడవలు, ఇవ్వాల్సిన టికెట్ల కోసం ఒత్తిళ్ళు, పొత్తుపై ఏమీ మాట్లాడని బీజేపీ అగ్రనేతలు. మొత్తానికి అన్నింటి మధ్య చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందని పార్టీవర్గాల టాక్. పార్టీలో నేతలకు సమాధానం చెప్పలేక టికెట్ల కోసం పోటీపడుతున్న సీనియర్లను సర్దుబాటు చేయలేక, జనసేన నుండి పెరిగిపోతున్న వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నా టీడీపీ కూటమికి 160 సీట్లు రావటం ఖాయమని, జగన్ చిత్తుగా ఓడిపోవటం తధ్యమని చెప్పుకుని తృప్తిపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: