రేపు మూడు జిల్లాల పర్యటనకు సీఎం జగన్

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరద ధాటికి ముఖ్యంగా దక్షిణాంధ్ర ప్రాంతం,  రాయలసీమ అల్లాడిపోయింది. వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైన‌ది. డిసెంబ‌ర్ 02, 03 తేదీల‌లో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల‌లో కూడా పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. వ‌ర్షం వ‌చ్చిన తొలిద‌శ‌లో బీభ‌త్సం సృష్టించిన‌ప్పుడే సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.
క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.  కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్‌ విడుదలైన‌ది. రెండో తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో రాజంపేట మండలం మదనపల్లి కి వెళ్ల‌నున్నారు. ముఖ్యంగా పులపాతూరు గ్రామంలో సీఎం పర్యటిస్తారు. భారీగా దెబ్బ తిన్న గ్రామాన్ని సందర్శించి..బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడ‌నున్నారు ముఖ్య‌మంత్రి. సహాయ శిబిరాలను సందర్శించిన త‌రువాత గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి త‌రువాత‌ మందపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ తరువాత వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం ప్రాంతాన్ని సీఎం స్వయంగా ప‌రిశీలించ‌నున్నారు.
గురువారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు సీఎం రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. 3.40కి రోడ్డు మార్గంలో బ‌య‌లుదేరి 3.55 గంట‌ల‌కు రేణిగుంట మండ‌లంలోని వేదాల చెరువు ఎస్టీ కాల‌నీ చేరుకుని కాల‌నీవాసుల‌తో మాట్లాడ‌నున్నారు సీఎం. సాయంత్రం 4.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి 4.40 గంట‌ల‌కు ఏర్పెడు మండ‌లంలోని పాపానాయుడుపేట‌కు వెళ్లి వ‌రద న‌ష్టాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఆ త‌రువాత 4.55 గంట‌ల‌కు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి సాయంత్రం 5.10 గంట‌ల‌కు తిరుచానూర్‌-పాడిపేట క్రాస్‌కు చేరుకుని బాధితుల‌తో మాట్లాడ‌నున్నారు.
5.40 గంట‌ల త‌రువాత తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి అతిథి గృహానికి చేరుకుని 7 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో వ‌ర‌ద‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు సీఎం. అక్క‌డే బ‌స చేసి రాత్రికి అక్క‌డే ఉండ‌నున్నారు. ఆ త‌రువాత రోజు 3వ తేదీన ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప‌ద్మావ‌తి అతిథి గృహం నుంచి బ‌య‌లుదేరి 8.40 గంట‌ల‌కు తిరుప‌తిలోని కృష్ణాన‌గ‌ర్‌కు చేరుకుని బాధితుల‌తో మాట్లాడుతారు. 9.25 గంట‌ల‌కు బ‌య‌లుదేరి ఆటోన‌గ‌ర్‌కు చేరుకుని బాధితుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు సీఎం. 10.20 బ‌య‌లుదేరి రేణిగుంట విమాన‌శ్ర‌యానికి చేరుకుని 10.30కి నెల్లూరు జిల్లాకు ప‌య‌నం అవుతారు ముఖ్య‌మంత్రి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: