ఎక్కడో చైనాలో పుట్టి మన దేశానికి తరలివచ్చి, వేట మొదలు పెట్టిన కరోనా రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఈ మాయదారి వైరస్ తన మన అనే భేదం లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు గ్రామాలకు సైతం పాకింది. ఇలా ప్రపంచమంతా ఈ వైరస్ ను చూసి భయంతో పరుగులు తీస్తుంటే, ఒక గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం నిమ్మళంగా ప్రశాంతంగా కూర్చున్నారు. దీనికి కారణం ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడమే. అంతే కాదు ఇక ముందు కూడా మా ఊరిలో కరోనా కేసులు నమోదు కావు అంటూ ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఏ స్థాయిలో ఉందో తెలిసిన విషయమే, అయితే అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం, దిగువ చెర్లోపల్లి అనే గ్రామంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
ఇదంతా మా ఊరి గ్రామ సచివాలయం కారణంగానే సాద్యమయిందంటున్నారు ఆ గ్రామస్తులు. కరోనా మొదలైనప్పటి నుండి మా గ్రామంలో నుండి అడుగు బయట పెట్టింది లేదు. ఏ సమస్య వచ్చినా అందరం కలసి మా ఊరి సచివాలయం దగ్గరకు చేరుకుని అక్కడే పరిష్కరించుకుంటున్నాము. ఊరిలో పండే కూరగాయలను తింటున్నాము. పాలు కూడా ఇక్కడివే. చికెన్, మటన్ కోసం కూడా మా గ్రామం దాటడం లేదు. ఊర్లో దొరికే నాటుకోళ్ళనే తింటున్నాము. మా ఊర్లో రసాయనిక ఎరువులు వాడము. పంటలు పండించేందుకు ఆవుపేడ, పలు రకాల ఆకులతో తయారు చేసిన సహజ ఎరువులను మాత్రమే వ్యవసాయానికి వాడుతాము. ఆ కూరగాయలనే తింటాము. అందుకే చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము అంటూ తెలిపారు.
దేశమంతా కరోనా సంక్షోభంతో కలవరపడుతుంటే ఈ గ్రామం మాత్రం ముందస్తు ప్రణాళికను రచించుకొని కరోనా భయం లేకుండా హాయిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. రెండువేల మందికి పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అంటే, ఇది ఆ గ్రామ ప్రజలు ఊరినుండి కాలు బయట పెట్టకపోవడం వలనే సాధ్యమయింది.