నరాలు తెగే ఉత్కంఠ.. రేపటి పరిస్థితి ఏంటో..?
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా చూస్తే మూడోవిడతలో 3 వేల 221 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. మూడోవిడతలో 579 పంచాయతీలు 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలు మినహాయించి మిగిలిన 2 వేల 642 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు బరిలో 7 వేల 756 మంది పోటీపడుతున్నారు.
మావో ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ మాత్రమే పోలింగ్ జరగనుంది. ప్రధానంగా మన్యం సహా కీలక ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట భ ద్రతను ఏర్పాటు చేశారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే తొలి, రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించగా.. మూడు, నాలుగు విడతల్లోనూ ఇవే ఫలితాలు రిపీటవుతాయని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఏపీలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అనేలా ఉన్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ చేశారు.
మరి రేపు జరిగే ఎన్నికల్లో ఓటర్ మహాశయులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఇదే ఇపుడు రాజకీయ పార్టీల్లో నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు.