ఘరానా మోసం: 750 రూపాయిలు పోయాయని చెబితే మొత్తం డబ్బు అంతా కొట్టేసారుగా.. !!!

Suma Kallamadi
టెక్నాలజీ ఎంతగా ముందుకు దూసుకుని పోతుందంటే మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమయ్యేలాగా అన్నమాట. అమాయకుల అకౌంట్ లో డబ్బులు కొట్టేసే సైబర్ నేరగాళ్లు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. పాపం ప్రతి రూపాయిని కష్టపడి సంపాదించుకుని బ్యాంకు అకౌంట్ లో దాచుకుంటే భద్రంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ప్రజల్ని మోసం చేసే నేరగాళ్లు మాత్రం వాళ్ళ నమ్మకాన్ని వొమ్ము చేస్తున్నారు. ఇలాంటి ఒక  ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది. వివరాలలోకి  వెళితే ఆన్‌లైన్‌ చెల్లంపుల్లో రూ.750 పోయాయి. వాటిని తిరిగి వచ్చేలా చేస్తామని ఆ వ్యక్తిని నమ్మబలికి అకౌంట్ లో ఉన్న  రూ.32000లు స్వాహా చేసిన  సంఘటన శుక్రవారం వెలుగుచూసింది.



భవానీపురం టెలిఫోన్‌ కాలనీలో నివాసం ఉండే జి.వి.ఎల్‌.ఆర్‌.గోదాదేవి భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. జులై 8వ తేదీన భర్తకు అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి దగ్గరగా ఉన్న హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళింది. అయితే అక్కడ వైద్యం ఖర్చుల నిమిత్తం 750 రూపాయిల ఫీజుచెల్లించాలని చెప్పారు.తన దగ్గర డబ్బులు లేక 750 రూపాయలను గూగుల్‌ పే ద్వారా చెల్లించింది.కానీ ఆ డబ్బులు ఆసుపత్రి వారు తమ ఖాతాలోకి జమకాలేదని చెప్పటంతో ఆశ్చర్యపోయింది. అయితే ఆన్‌లైన్‌లో కనిపించిన గూగుల్‌ పే నంబరుకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. అయితే ఫోన్‌ అందుకున్న సైబర్‌ నేరగాళ్లు ఆ మహిళను నమ్మించి తాము చెప్పినట్లుగా చేస్తే తిరిగి నగదు జమ అవుతుందని చెప్పారు.అయితే 750 రూపాయిలు వెనక్కి వస్తాయని నమ్మిన ఆమె వారు చెప్పినట్లుగా చేసింది. ఇంకేముంది క్షణాల్లో బ్యాంకు ఖాతా కాళీ అయింది.బ్యాంకు ఖాతాలోని రూ.32వేలు వారికి బదిలీ అయినట్లు వెంటనే ఆమెకి మెసేజ్ వచ్చింది.



షాక్ తిన్న మహిళ మళ్ళీ వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్‌ కలవలేదు.ఎన్ని సార్లు చేసిన ఫోన్ కలవక పోయేసరికి తాను మోసపోయినట్లుగా గ్రహించి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆన్లైన్ లో జరిగే మోసాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వారు ఫోన్ చేసి బ్యాంకు డీటెయిల్స్ గాని ఓటీపీ గాని, ఎటిఎం పిన్ నెంబర్ గాని అడిగాని ఎట్టి పరిస్థితులలో ఎవరికి చెప్పకూడదు సుమా.. !!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: