అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైసీపీ నేతల ఆరోపణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 4 వేల ఎకరాల మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కారు పెద్దలు తరచూ చెబుతున్నారు. అయితే దీన్ని టీడీపీ నేతలు కూడా పెద్దగా ఖండించడం లేదు.
అవును! అమరావతిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు భూములు కొంటే తప్పేంటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చు. ఆ మాట కొస్తే ఇప్పడు జమ్మూకాశ్మీర్లో కూడా ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. దీనిని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే ఆయా భూములను ఎప్పుడు.. ఏ పరిస్థితిలో కొన్నారు? అనేది ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న ప్రశ్న. అదేసమయంలో వాటిని అక్కడే ఎందుకు కొనాలనేది టీడీపీ నేతలు జవాబులు చెప్పాల్సిన ప్రశ్న.
రాజధాని నిర్మించే మహత్తర అవకాశం 2014లో చంద్రబాబు సర్కారుకు వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని టీడీపీ సర్కారు అక్రమాలకు ఉపయోగించిందన్నది వైసీపీ నేతల ఆరోపణ. రాజధాని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టును పట్టించుకోని చంద్రబాబు తన మంత్రులతో మరో కమిటీ వేయించారు. ఆ తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో పెట్టాలని నిర్ణయించుకుని ఆ సమాచారాన్ని తమ ఆప్తులతో పార్టీ నేతలతో పంచుకున్నారనేది వైసీపీ ఆరోపణ.
ప్రధానంగా తన పార్టీలోని కమ్మ సామాజిక వర్గ నేతలకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పడం వల్ల.. రాష్ట్రం నలు మూలల నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలు.. అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్నారు. ఈ విషయాన్ని ఇటీవల వైసీపీ మంత్రులు లైవ్ ప్రజంటేషన్ షో వేసి మరీ వివరించారు. మరి ఆ కమ్మటి నిజాలు దాస్తే దాగుతాయా.. ఇప్పుడు వైసీపీ సర్కారు ఆ లెక్కలన్నీ పక్కాగా బయటపెట్టి దోషులను బోనులో పెడతానంటోంది. చూడాలి ఈ విషయంలో వైసీపీ సర్కారు ఎంత గట్టిగా ఉంటుందో..?
మరింత సమాచారం తెలుసుకోండి: