జగన్ పార్టీ కి ఒక పాలసీ అంటూ లేదా? ఈ మంత్రి ఇలా అంటాడేంటి..?
ఒక్కో విషయంలో ఒక్కో పార్టీ కి ఒక్కో పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే పార్టీ క్యాడర్ అంతా నడుచు కుంటారు. కానీ వైసీపీ లో అలా కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్ఆర్సీ బిల్లుకు, క్యాబ్ బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దానికి వైసీపీ పూర్తి వ్యతిరేకమని అంటున్నారు.
ఆయన ఏమంటున్నారు అంటే.. "
ఎన్ఆర్సీ బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని, సీఎం వైయస్ జగన్ ముస్లింల పక్షపాతి అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. సీఏబీ (సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్), ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) వేర్వేరు అని చెప్పారు. సీఏబీతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పిన తరువాతే వైయస్ఆర్ సీపీ మద్దతు తెలిపిందన్నారు.
పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక్ దేశాల్లో ఉన్న ఆరు వర్గాలకు చెందిన మైనార్టీలు ఆ దేశంలో హక్కులు రానిపక్షంలో, అక్కడ ఇమడలేని పరిస్థితుల్లో మన దేశానికి వస్తే రాజ్యాంగం ప్రకారం వాళ్లకు పౌరసత్వం ఇస్తామని, దీని ద్వారా దేశంలో ఉండే ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తరువాతే వైయస్ఆర్ సీపీ మద్దతు ఇచ్చిందన్నారు.
బీజేపీకి చెందిన పెద్దలు కొందరు దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీని తీసుకువస్తామని చెబుతున్నారని, దీన్ని వైయస్ఆర్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. 1971 మునుపు ప్రతి భారతీయుడు తన ఆధారాలు చూపించాలని ఉండేదన్నారు. రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతంగా ముస్లిం మైనార్టీలకు మాట ఇస్తున్నానని, రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి అన్యాయం జరిగినా సహించమన్నారు.
ఎన్ఆర్సీ బిల్లును అన్ని ఫార్మాట్లలో వ్యతిరేకిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైయస్ఆర్ సీపీ పెద్దలతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ పెద్దలతో మాట్లాడడం జరిగిందని, వైయస్ఆర్ సీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.