వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ కాకముందే బెజవాడలో రాజకీయాల్లో వేడి రగులుకుంది. ఈ వేడి రోజు రోజుకు పెరిగిపోతున్నది. చలిని సైతం చీల్చుకొని కాకరేపుతున్నది రాజకీయం. విజయవాడ రాజకీయాలు చుట్టూనే వర్మ కథను అల్లి సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో బెజవాడలోకి కడపనుంచి వచ్చిన రెడ్లు ఎలాంటి ఆధిపత్యం చెలాయించారు అన్నది కథ. ఈ కథతో కూడిన సినిమా రిలీజ్ కాకముందే ప్రత్యక్షంగా నిజజీవితంలో ఇలాంటి కథతో కూడిన రాజకీయాలే ప్రజలకు కళ్ళముందు కనిపిస్తున్నాయి.
వైకాపా పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు విమర్శలు చేయడం అంటే మంచి భాషనే వాడేవారు. కానీ, ఇప్పటి అధికార పార్టీ వాడే భాష మారిపోయింది. మాట్లాడే తీరు మారింది. ఎలాంటి విమర్శలు చేస్తారో వారికే తెలియదు. ఎలా మాట్లాడుతున్నారో పట్టించుకోవడం లేదు.
వ్యక్తులపై ఎంతటి కోపం ఉన్నా ఇలాంటి భాషను వాడేందుకు ఇష్ట పడరు. భయపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశి బాబు బాబు గురించి, లోకేష్ గురించి అనేక మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ ను వర్మ పప్పు అని డైరెక్ట్ గా అంటున్నారని, అనడమే కాకుండా, సినిమాలో సింబాలిక్ పప్పును చూపించాలని, ఇలా చేసిన వర్మ గురించి లోకేష్ ఒక్కమాట కూడా మాట్లాడటానికి భయపడతారని అన్నారు.
వర్మ గురించి తప్పుగా మాట్లాడితే.. మరలా ఎక్కడ ఎలాంటి సినిమా తీస్తాడో అని లోకేష్ అండ్ కో భయపడుతున్నారని వంశి విమర్శించారు. గూగుల్ లో పప్పు అని కొడితే లోకేష్ ఫోటోనే వస్తోందని, అలా రాలేదు అంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానని వంశి సవాల్ విసిరారు. వంశి సవాల్ పై లోకేష్ స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ స్పందిస్తే.. ఎలా స్పందిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉన్నది.