గత పదిహేను రోజులుగా జాతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు మహా మలుపులు, ఊహించని ట్విస్ట్ లతో ఉత్కంఠ రేపుతున్నాయి. వరుస ట్విస్ట్ల పరంపరలో మరో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక గవర్నర్ ముందుగా బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించగా ఆ పార్టీ తమకు పూర్తి మెజార్టీ లేదంటూ చేతులు ఎత్తేసింది. ఇక ఇప్పుడు శివసేనను ఆహ్వానించగా శివసేన ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆఘమేఘాల మీద రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ముందుగా ఎన్సీపీతో చేతులు కలిపేందుకు రెడీ అయ్యింది.
ఎన్సీపీ అధినేత శరద్పవార్ సైతం ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో పాటు శివసేన ఎన్డీయే నుంచి బయటకు వస్తే తాము శివసేనకు మద్దతు ఇస్తామని చెప్పడంతో శివసేన క్షణాల మీద ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. శివసేన కేంద్రంలో ఉన్న పదవులను సైతం వదులుకుంది. దీంతో ఇక్కడ ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుగా ఎన్సీపీ రెడీ అయ్యింది. ఇక అటు కాంగ్రెస్ సైతం శివసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తోంది.
సోనియా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఆఘమేఘాల మీద ఢిల్లీ పిలిపించుకుని చర్చించారు. ఇక సోమవారం గవర్నర్కు ప్రభుత్వ ఏర్పాటుపై తమ నిర్ణయం తెలపాల్సి ఉండడంతో వీరు గవర్నర్ను కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ మూడు పార్టీల మధ్య డీల్ కుదిరినట్టు కూడా తెలుస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. మహారాష్ట్ర సీఎం పదవి చేపడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని లీకులు వచ్చాయి.
అలాగే శివసేనకు ముఖ్యమంత్రి పదవి, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్కు స్పీకర్ పదవి కూడా ఇస్తారని మరో లీక్ బయటకు వచ్చింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని, వర్లి నుంచి పోటీ చేసిన ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ ముందు ఇటీవల శివసేన డిమాండ్ ను ఉంచిన విషయం తెలిసిందే. బీజేపీ ఇందుకు నిరాకరించడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.