సెన్సేషన్ : ఓ డైరెక్టర్, ఇద్దరు హీరోల అరెస్ట్ కు రంగం సిద్ధం..!

Vasishta

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అయితే టాలీవుడ్ లో పలువురు ప్రముఖులను విచారించిన తర్వాత ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణిగిపోయింది. ఏదో లాలూచీ జరిగిందని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ కేసులో ముగ్గురు ఇండస్ట్రీ ప్రముఖులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.


          టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తొలి ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎక్సైజ్ డీజీ అకున్ సభర్వాల్ నేతృత్వంలోని టీమ్.. టాలీవుడ్ డ్రగ్స్ కేసును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తోంది. గతంలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, శ్యాం కె.నాయుడు తదితరులను అకున్ టీం విడతలవారీగా విచారణ జరిపింది. అప్పుడు పలువురు ఫోరెన్సిక్ పరీక్షలు చేపట్టింది.


          నాడు విచారించిన వారిలో కొంతమంది ఫోరెన్సిక్ పరీక్షలకు నిరాకరించగా మెజారిటీ సభ్యులు పరీక్షలకు ఆమోదం తెలిపారు. అలా పరీక్షలకు సహకరించినవారిలో కొంతమంది నివేదికలను ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పోలీసులకు పంపినట్టు సమాచారం. అందులో డ్రగ్స్ వాడినట్టు నిర్ధారణ అయిన ముగ్గురిపై ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు పోలీసులు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశముంది. మరికొంతమంది నివేదికలు రావాల్సి ఉన్నట్టు సమాచారం. ఆ నివేదికలు వచ్చాక వాటిని ఆధారంగా చేసుకుని ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.


          గతేడాది టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. సుమారు రెండు వారాలపాటు పలువురిని పోలీసులు విచారించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు తమను వేధిస్తున్నారంటూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆరోపించారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ టాలీవుడ్ ను వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం పూర్తిగా కనుమరుగైపోయింది. తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: