ఢిల్లీ : కవిత వర్సెస్ ఈడీ...ఏం జరుగుతుంది ?

Vijaya



ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారమంతా ఇపుడు కల్వకుంట్ల కవిత వర్సెస్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)గా మారిపోయింది. ఈ స్కామ్ లో ఇప్పటికి 11 మందిని అరెస్టుచేసినా ఎవరి వైపునుండి ఈడీకి ఈ స్ధాయిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా బహుశా కవితను ఆదర్శంగా తీసుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే శనివారం విచారణకు హాజరుకావాల్సిన మాగుంట గైర్హాజరయ్యారు.



ఇదే కేసులో ఇప్పటికే మాగుంట కొడుకు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్టుచేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. సరే కవిత విషయానికి వస్తే ఈనెల 11వ తేదీన విచారణకు హాజరైన కవిత తర్వాత నుండి ఈడీని లెక్కచేయటంలేదు. 16వ తేదీన విచారణకు హాజరవ్వకుండా డుమ్మాకొట్టారు. విచారణకు హాజరుకాకుండా కోర్టు నుండి రక్షణ పొందుదామని ప్రయత్నిస్తే సుప్రింకోర్టు పట్టించుకోలేదు. దాంతో ఈడీ నోటీసులో చెప్పినట్లు 20వ తేదీన విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారిపోయింది.



విచారణ నుండి తప్పించుకునే ప్రయత్నించేకొద్దీ కవితపై ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయట. బీఆర్ఎస్ లోనే నేతలు కవితకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. తనకు స్కామ్ తో ఎలాంటి సంబంధంలేదని చెప్పిన కవిత, అరెస్టయినా పర్వాలేదు జనాల ముందుకెళతానని చెప్పిన కవిత ఇపుడు విచారణకు హాజరవ్వటానికే ఎందుకు భయపడుతున్నారని కారునేతలు మాట్లాడుకుంటున్నారట. కవిత చర్యలు జనాల్లో రాంగ్ సిగ్నల్స్ వెళుతున్నాయని నేతలు చెప్పుకుంటున్నారట.



మరి సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతారా లేదా అన్నదైతే తెలీటంలేదు. మొత్తానికి కవిత ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. విమెన్ రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ పేరుతో కవిత ఢిల్లీకి చేరుకున్నారు. విచారణకు హాజరుకాకపోతే జరగబోయే పరిణామాలు కవితకు ఈపాటికే తెలుసుంటాయి. కాబట్టి ఎలాగూ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి విచారణకు హాజరవుతారా లేకపోతే ఘర్షణాత్మక వైఖరి కంటిన్యుచేస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: