కరోనా.. మూడో డోసు కావాల్సిందేనా..?
అయితే.. రెండు డోసులు తీసుకున్నాం కదా.. అని ప్రశాంతంగా ఉండాల్సిన పని లేదు.. ఎందుకంటే ఇప్పుడు అనేక దేశాలు మూడో డోసుకు సిద్ధమవుతున్నాయి. కరోనా బూస్టర్ డోసులను తమ దేశ ప్రజలకు అందిస్తున్నాయి. ఇజ్రాయల్, అమెరికా, టర్కీ, చిలీ వంటి దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసులు పంపిణీ చేస్తున్నాయి. అందరికన్నా ముందే ఇజ్రాయెల్ బూస్టర్ టీకాలు ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పటి వరకూ మొత్తం 92 దేశాలు బూస్టర్ డోస్ ఇస్తున్నాయట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఈ బూస్టర్ డోసుల విషయంలో ఇజ్రాయెల్ ముందుందట.. ఎందుకంటే.. ఆ దేశం తన జనాభాలో 44 శాతానికి మూడో మోతాదు టీకాలు అందించిందట. అంతే కాదు.. 5-11 ఏళ్ల పిల్లలకూ వ్యాక్సిన్లు వేయడానికి ఆ దేశ నిపుణుల బృందం పచ్చజెండా ఊపేసింది. అసలు ఎందుకు ఇంతగా ఈ దేశాలు బూస్టర్ డోసుల కోసం ప్రయత్నిస్తున్నాయో తెలుసా.. ఎందుకంటే.. రెండు డోసులు తీసుకున్నా కూడా కోవిడ్ నుంచి రక్షణ దొరకడం లేదట. రెండు డోసులు తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా వస్తోందట. అనేక దేశాల్లో రెండు డోసులు తీసుకున్న చాలా మందిలో మళ్లీ కరోనా కనిపించిందట.
అందుకే.. ఈ దేశాలు మూడో డోసుపై దృష్టి పెట్టాయి. దేశంలో సగం కంటే ఎక్కువ జనాభాకు రెండు డోసులు వేసిన ఇజ్రాయెల్ లో కూడా మళ్లీ కరోనా వస్తోందట. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలలో కూడా గతంలో రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా వచ్చిందట. అందుకే ఈ దేశాలన్నీ బూస్టర్ డోసులు అందించడంపై దృష్టి సారించాయి.