‘బిగ్ బాస్ 2’ షో రేపటితో ముగిసిపోతున్న నేపధ్యంలో ఈషో అంతిమ విజేత ఎవరు అన్న విషయమై విపరీతమైన ఊహాగానాలు జరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ముగింపుకు వస్తున్న ఈ షోకు మరో ట్విస్ట్ ఇవ్వాలని ఇప్పటి వరకు ఈ షో నుండి ఎలిమినేట్ అయిన సభ్యులు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వచ్చి సందడి చేసారు.
వీరంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడితో తమ అన్యోన్యతను చాటుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి నూతన్ నాయుడు డుమ్మా కొట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. దీనితో ఇతని ప్రవర్తన పై అనేక సందేహాలు ఏర్పడటంతో నూతన నాయుడు ఫేస్ బుక్ లో ఒక సంచలన పోస్ట్ పెట్టి ఈవివాదాన్ని మరింత హైలెట్ చేసాడు.
ప్రస్తుతం నూతన్ నాయుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాసంగా మారింది. నూతన్ నాయుడు పెట్టిన పోస్ట్ ను సపోర్ట్ చేస్తూ చాలామంది సందేశాలు పెడుతున్నారు. ‘ఎంతో ఆదరణ, అభిమానాన్ని చూపించిన వారికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. నేను అర్ధాంతరంగా బిగ్ బాస్ నుంచి బయటకు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతూ సందేశాలు పంపారు. కోట్లలో ఓట్లు వచ్చినా బిగ్ బాస్ పరిగణనలోకి తీసుకోలేదు. బిగ్బాస్ కావాలనే ఇదంతా చేశాడు. పక్షపాతంతో వ్యవహరించాడు. ఇంటిలో నా పెర్ఫార్మెన్స్ ను తప్పుగా చూపించారు అని అందరూ అంటున్నారు. కానీ దానిపై నేను మాట్లాడదలచుకోను. రాజకీయాల్లోనైనా, బిగ్ బాస్లోనైనా ప్రజా తీర్పే నాకు శిరోధార్యం. నేను ఇంటిలో నుంచి ఎలిమినేట్ అయినందుకు చెప్పడం లేదు. ప్రజాతీర్పుకు అనుగుణంగానే ఎలిమినేషన్ జరుగాలి. చూసే జనానికి కూడా అనిపించాలి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది’ అంటూ నూతన నాయుడు సంచలన కామెంట్స్ చేసాడు.
దీనితో రేపటి రోజున జరగబోయే ‘బిగ్ బాస్ 2’ విజేత ఎంపిక సక్రమంగా జరుగుతుందా లేదంటే ఈ ఎంపికలో ఏమైనా రాజకీయాలు ప్రభావితం చేస్తాయా అన్న కోణంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే గీతా మాధురికి అనేకమంది మహిళలు కౌశల్ కు కౌశల్ ఆర్మీ రంగంలోకి దిగి లక్షల స్థాయిలో ప్రతిరోజు ఓట్లు వేస్తున్న నేపధ్యంలో ‘బిగ్ బాస్ 2’ విజేత విషయంలో ఊహించని సర్ ప్రైజ్ ఉంటుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి..