ఎమోషనల్ అయినా తారకరత్న భార్య...!!

murali krishna
సరిగ్గా ఇదే రోజు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ ప్రముఖ హీరో నందమూరి తారక రత్న గతేడాది ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు.నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో గుండెపోటు బారిన పడ్డ ఆయనను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారాయన. తారక రత్న మరణంతో టాలీవుడ్‌ ఇండస్డ్రీతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికీ చాలామంది తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అతనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి నిత్యం తారకరత్న జ్ఞాపకాలతోనే జీవితం గడిపేస్తోంది. అప్పుడప్పుడూ సోషల్‌మీడియా వేదికగా భర్తతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆదివారం తారక రత్న మొదటి వర్ధంతి సందర్భంగా అలేఖ్య సోషల్‌ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్‌ షేర్‌ చేసింది. తారక రత్న చిత్ర పటం దగ్గర తన ముగ్గురు పిల్లలతో ఉన్న వీడియోను పంచుకున్న అలేఖ్య 'నేను నిన్ను ఆఖరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో ఆవేదన ఎవరికీ చెప్పలేనిది. 18/2/2023 నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. రెండు భిన్నమైన ప్రపంచాల నుంచి మనం ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాం. ఇందులో ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. నీకు మరణం లేదు. నువ్వే మా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు' అని రాసుకొచ్చింది.ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి షేర్‌ చేసిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక రత్నను గుర్తుచేసుకుంటున్నారు. అలేఖ్యా రెడ్డి కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. కాగా తారక రత్న మొదటి వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నార లోకేశ్ నివాళులు అర్పించారు. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకున్నామంటూ ఎమోషనల్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: