75వ పంద్రాగస్టు : అక్షరం నేర్వని బతుకులు అక్షరాలా 15 కోట్లు..!?

దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ 75 ఏళ్లలో దేశం గర్వపడే క్షణాలు ఎన్నో.. దేశం స్వశక్తితో సాధించిన విజయాలెన్నో.. అనేక రంగాలలో ప్రపంచస్థాయిలో సత్తా చాటుతున్న దృశ్యాలెన్నో.. వినువీధిలో ఎగిరిన భారత విజయ పతాకాలెన్నో.. అయితే.. ఈ సంబరాల వెనుక కొన్ని చీకటి నీడలూ ఉన్నాయి. ఇండియా వెలిగిపోతోందంటే.. దేశమంతా వెలిగిపోతున్నట్టు కాదు.. ఇంకా చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. అధిగమించాల్సిన దూరాలు మిగిలే ఉన్నాయి.

అలాంటిదే ఈ అవిద్య కోణం.. అవును.. మనదేశం రెండు భారత దేశాలుగా మనుగడ సాగిస్తోంది. ఆర్థిక అంతరాలు దేశాన్ని నిలువునా రెండుగా విభజిస్తున్నాయి. నిత్యం సకల సౌకర్యాలతో విలసిల్లే వర్గం ఒకటి ఉంటే.. కనీస సౌకర్యాలకు నోచుకోని బడుగుల జీవితాలూ ఇంకా ఉన్నాయి.. ఈ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది... తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పిన విషయం. అదేంటంటే.. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారట. మరో 25 కోట్ల మందికి అక్షర జ్ఞానం కూడా లేదట.

భారత పారిశ్రామిక సమాఖ్య గురువారం  నిర్వహించిన ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ధర్మేంద్ర ప్రదాన్ ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్‌ సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయాలు వెలుగు చూశాయట. వీటిలో దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారట. ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారట. అంటే.. 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారన్నమాట.

దేశం అభివృద్ధి చెందుతోంది.. కానీ.. ఆ అభివృద్ధి అన్ని వర్గాలకూ చేరాలి.. దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది.. ఆ ప్రగతి ఫలాలు అందరికీ అందాలి.. సకల సౌకర్యాల భారతం.. అందరికీ కావాలి.. అందరం బావుండాలి.. అందులో మనం ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: