ఫిడే చెస్ ప్రపంచకప్లో తెలుగు గ్రాండ్మాస్టర్ (జీఎం) పెంటేల హరికృష్ణ ప్రస్థానం ముగిసింది. రష్యాలోని సోచిలో శుక్రవారం ఇరాన్ జీఎం సయ్యద్ మహ్మద్ అమిన్తో జరిగిన నాలుగో రౌండ్ రెండో గేమ్ను హరి 115 ఎత్తుల తర్వాత డ్రా చేసుకున్నాడు. అయితే, తొలి గేమ్లో హరి పరాజయం పాలవడంతో అమిన 1.5-0.5 స్కోరుతో క్వార్టర్స్ చేరాడు. గురువారం జరిగిన నాలుగో రౌండ్ తొలి గేమ్లో హరికృష్ణ 57 ఎత్తుల తర్వాత ఓటమి పాలయ్యాడు. దీంతో అనివార్యంగా గెలవాల్సిన రెండో గేమ్లో హరి ఓడిపోవడంతో అతడి టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి.
విదిత సంతోష్ గుజరాతి నాలుగో రౌండ్ రెండో గేమ్లోనూ జీఎం జెఫ్రీ జియాంగ్ (యూఎస్ఏ)పై సూపర్ విక్టరీ సాధించి 2-0తో క్వార్టర్స్ చేరాడు. భారత్ నుంచి వరల్డ్కప్ బరిలో ఉన్న ఏకైక జీఎం విదిత్నే కావడం విశేషం. ఇక, కెరీర్లో తొలి వరల్డ్కప్ ఆడుతున్న చెన్నై జీఎం రమేష్ ప్రజ్ఞానందా నాలుగో రౌండ్ రెండో గేమ్లో ఓడిపోవడంతో 0.5-1.5 స్కోరుతో ఇంటిముఖం పట్టాడు. అంతకుముందు యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందా మూడో రౌండ్లో పోలెండ్ వెటరన్ జీఎం మైకెల్ క్రాసెన్కోతో తలపడ్డాడు. ప్రజ్ఞానందా ఒక గేమ్లో గెలిచి మరో దాంట్లో ఓడడంతో ట్రై బ్రేకర్ అనివార్యమైంది. దీంతో జరిగిన ర్యాపిడ్ ట్రై బ్రేకర్లో ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు 2-0తో 57 ఏళ్ల క్రాసెన్కోను చిత్తు చేసి ముందంజ వేశాడు. టై బ్రేకర్ రెండో గేమ్లో ప్రజ్ఞానందా 67 ఎత్తుల్లో క్రాసెన్కోను ఓడించాడు. ఇక, ఇక్కడే జరుగుతున్న మహిళల వరల్డ్కప్లో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్లో ఓటిమి పాలై ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హారిక మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనగా మరో తెలుగు గ్రాండ్మాస్టర్ కొనేరు హంపి మెగా ఈవెంట్లో పాల్గొనలేదు.