న్యూజిలాండ్ తో మొదటి టీ 20లో భారీ స్కోర్ ను సునాయాసంగా ఛేజ్ చేసి ఘనవిజయం సాధించిన టీమిండియా ఆదివారం రెండో టీ20 లో లో స్కోర్ ను ఏమాత్రం తడబాటు లేకుండా ఛేదించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టీ 20 లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20ఓవర్ల లో 5వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది . భారత్ బౌలర్లు నియంత్రణ తో బౌలింగ్ చేయడం తో కివీస్ ఆటగాళ్లకు పరుగులు తీయడానికి కష్టమైంది. ముఖ్యంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 4ఓవర్ల లో 18పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి ఆకట్టుకోగా బుమ్రా , శివమ్ దూబే , శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ మొదటి ఓవర్ లోనే పెవిలియన్ చేరి మరోసారి నిరాశపరచగా ఆతరువాత కోహ్లీ కూడా వెంటనే వెనుదిరిగాడు. ఈదశలో మొదటి మ్యాచ్ హీరోలు రాహుల్(57*) , శ్రేయస్ అయ్యర్(44) చక్కటి సమన్వయంతో ఆడుతూ టీం ను లక్ష్యం వైపు నడిపించారు. అయితే హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ను ముగించేలా కనిపించిన శ్రేయస్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ కాగా ఆతరువాత శివమ్ దూబే 17ఓవర్ మూడో బంతిని సిక్స్ గాతరలించి గెలుపు ఖరారు చేశాడు. ఇక ఈ విజయం తో 5మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఈనెల 29న జరుగనుంది.