మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని తనదైన స్టైల్ లో జగన్ దూసుకుపోతున్నాడు. ఎక్కడా కూడా ఆలస్యం, అలసత్వం ప్రదర్శించకుండా తన మార్క్ పాలనను చూపిస్తున్నాడు. పేదల పెన్నిధిగా, ప్రజల పక్షపాతిగా ఉండటమే కాకుండా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ఎవరికీ సాధ్యం కానీ పాలనను అందించడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నాడు.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ఎవరికి అంతుపట్టనివిగా.. ఎవరు ఊహించనిగా ఉంటున్నాయి. దీంతో జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థంగాక ప్రతిపక్ష పార్టీలు అయోమయంలో పడిపోయాయి. ప్రధాని మోడీ సైతం నిన్న తిరుపతి వచ్చినపుడు జగన్ ను మెచ్చుకున్నారు.
అన్నింటిలోను తనదైన మార్కును చాటుకుంటున్న జగన్, ఒక్క విషయంలో మాత్రం కెసిఆర్ ను ఫాలో అవుతున్నాడు. తెలంగాణాలో తెరాస లో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే హరీష్ రావుకు ఈసారి మంత్రిపదవి ఇవ్వలేదు. పార్టీకి సంబంధించిన ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కేవలం ఆయన్ను సిద్దిపేట నియోజక వర్గానికి పరిమితం చేసింది. కెసిఆర్ తరువాత తెరాస లో హరీష్ రావు అనే పేరుంది. అందుకే హరీష్ రావును పక్కన పెట్టారు.
ఇదే సూత్రాన్ని జగన్ ఆంధ్రపదేశ్ లో కూడా ఫాలో అయ్యాడు. వైకాపాలో జగన్ తరువాత ఆ స్థాయిలో వాయిస్ ను వినిపించిన నాయకురాలు రోజా. అసెంబ్లీలో సైతం తన మాటతో చంద్రబాబును సైతం భయపెట్టింది. దీంతో ఆమెను సభ నుంచి సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు. కానీ, ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నా.. ఫైర్ బ్రాండ్ అనే కారణం చూపి ఆమెను పక్కన పెట్టారు. తెలంగాణలో హరీష్ రావును ఎలా పక్కన పెట్టారో ఆంధ్రప్రదేశ్ లో రోజాను కూడా లాగే పక్కన పెట్టడం విశేషం.