ఏపి సీఎం వైఎస్ జగన్ ప్రధాని పట్ల వినయం - ఏపికి, ప్రజలకు ప్రధాని మోడీ అభయం

రెండవసారి అఖండ విజయం తరవాత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం తొలిసారి టెంపుల్ సిటీ తిరుపతి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రేణిగుంట విమానాశ్రయంలో ఉభయ తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, పలువురు వైసీపీ, బీజేపీ నాయకులు మోదీకి స్వాగతం పలికారు. విమానం నుంచి దిగిన తర్వాత తొలుత గవర్నర్ నరసింహన్ ఒక గులాబి పుష్పం ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ప్రధానికి రోజా పువ్వు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని పాదాలకు ప్రణామం చేయటానికి జగన్ ప్రయత్నించారు. అయితే, జగన్ చేతులు పట్టుకుని ఉన్న నరేంద్ర మోదీ అలా వద్దని వారించారు.

వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగానే జగన్ మరోసారి నరేంద్ర మోదీ కాళ్లకు మరోసారి నమస్కారం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా నరేంద్ర మోదీ, జగన్‌మోహనరెడ్డిని వారించారు. ఆ తర్వాత జగనమోహనరెడ్డి, ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ నాయకులను పరిచయం చేశారు. ఆ తరవాత జరిగిన బహిరంగ సభలో ఓట్లు వేసినా, వేయక పోయినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజాధన్యవాదసభలో ప్రధాని పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. "మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది. 130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహనరెడ్డికి శుభాకాంక్షలు. జగన్మోహనరెడ్డి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. ఏపీ అభివృద్ధికి, ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా" అని ప్రధాని ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుండబోతోందని - వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నొవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ కొత్త మార్గంలో పయనిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే బిజేపి ఆశయమైన నవభారతం నిర్మాణం జరుగుతుందని ప్రధాని అన్నారు. తిరుపతి సభలో ప్రధాని తెలుగు లో ప్రసంగాన్ని ప్రారంభించారు. "మళ్లీ నాకు అధికారం ఇచ్చిన భారతదేశ ప్రజలకు బాలాజీ పాదపద్మాల సాక్షిగా కృతజ్ఞతలు. స్వామికి ప్రణామాలు" అని తెలుగులో ప్రసంగం చేశారు. అలాగే, "నమో వెంకటేశం నమామి" అంటూ పద్యం పఠించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: