తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్లో ముఖ్య నేతలకు ఊహించని షాక్ తగలవచ్చంటున్నారు. పీసీసీ అధ్యక్షుడితోపాటు కార్యవర్గంలోనూ సమూల మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేస్తారని పార్టీ నేతల్లో చర్చ జరిగింది.
మరోవైపు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ విషయంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో టీపీసీసీ పదవికి ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామా చేస్తారని సమాచారం. ముందస్తు ఎన్నికల ఫలితాల తర్వాత తనను తప్పించాలని కోరుతూ ఆయన లేఖ రాసినట్టు తెలిసింది. దానిపై నిర్ణయం తీసుకోని నేపథ్యంలో మరోమారు ఆయన రాజీనామా లేఖ ఇస్తారంటున్నారు. ఉత్తమ్కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారనే ఉహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా, పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాతనే టీపీసీసీ అధ్యక్షపదవిపై అధిష్టానం దృష్టి పెట్టనున్నట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.