తూర్పు గోదావరి జిల్లాలోని రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం తుని. 1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో దాదాపు నాలుగు సార్లువరుసగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు మంత్రి యనమల. అయితే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ప్రజల మూడ్ ఎలా ఉంది? ఎవరికి ఓటేయాలని భావిస్తున్నారు? ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఎలా జరుగుతున్నాయి? వంటి కీలక విషయాలు చర్చకు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఇక్కడ అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు రెండింటి పరిస్థితీ దారుణంగానే ఉంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పాగా వేసింది.
అప్పటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఉరఫ్ రాజా ఇక్కడ నుంచి విజయం సాదించారు. వాస్తవానికి ఇది టీడీపీ కంచుకోట. పైగా టీడీపీ దిగ్గజం యనమల రామకృష్ణుడు వరుసగా ప్రాతినిధ్యం వహించిన నియో జకవర్గం అయినప్పటికీ.. ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమనే మాట టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. యనమల తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం, తన వ్యవహారాలను చక్కబెట్టుకోవడంతోనే సరిపుచ్చుకున్నారు. ఇక, అదే ఎన్నికల్లో టీడీపీ తరఫున యనమల తమ్ముడు యనమల కృష్ణుడు పోటీ చేశాడు. అయితే, యనమల రామకృష్ణుడు పై ఉన్న వ్యతిరేకత మొత్తం కృష్ణుడుపై పడింది. దీంతో అనూహ్యంగా 18 వేల ఓట్ల మెజారిటీతో దాడిశెట్టి విజయం సాధించారు.
దీంతో ఇక, తుని వైసీపీకి కంచుకోటగా మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి! విపక్ష ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం అభివృద్ధి నిధులను నిలిపి వేసింది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా పరిస్థితి దారుణంగా మారిపోయింది. తాగునీరు లేక ఇక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. డ్రైనేజీ సిస్టమ్ కొన్ని దశాబ్దాలుగా చెడిపోయింది. చిన్న చుక్క వర్షానికే ఇక్కడి డ్రైనేజీలు నదులను తలపిస్తున్నాయి దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇక, హ్యాచరీస్ కు ప్రాణసంకటంగా ఉన్న దివీస్ పరిశ్రమను తొలగించడం ఎవరి వల్లా సాధ్యం కావడంలేదు. ఆయా పనులపై ఎమ్మెల్యే దాడిశెట్టిని ప్రశ్నిస్తే.. తాను విపక్షంలో ఉన్నందున ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని , అందుకే పనులు జరగడం లేదని ఆయన బదులిస్తున్నారు.
ఇక, యనమల సోదరుడు కృష్ణుడు ఇక్కడ ఇసుక మాఫియాకు తెరదీశారని, తాండవ నదిని ఆయన ఆక్రమించుకుని దందా సాగిస్తున్నాడనే ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీకి, టీడీపీకి కూడా ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో మూడో ఆల్టర్నేట్ కోసం ప్రజలు ఎదురు చూస్తుండడం గమనార్హం.