చంద్రబాబునాయుడు ఇస్తున్న ర్యాంకులు అవినీతిలో అత్యున్నత స్ధాయికి చేరుకున్న ఎంఎల్ఏలకే ఇస్తున్నట్లుంది. ఎందుకంటే, ఎంఎల్ఏల పనితీరు ఆధారంగా చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల్లో పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడుకు మొదటి ర్యాంకు దక్కింది. కానీ ఎంఎల్ఏపై ఎప్పటి నుండో అవినీతి ఆరోపణలున్నాయి. అయినా చంద్రబాబు ఆరోపణలను పట్టించుకోకుండా ర్యాంకులు కేటాయించారు. కానీ తాజాగా ఓ కాంట్రాక్టర్ ను కమీషన్ కోసం వేధిస్తున్నడనే ఆరోపణలపై ఎంఎల్ఏ పరువు బజారున పడింది.
కమీషన్ కోసం ఎంఎల్ఏ కక్కుర్తి
ఇంతకీ విషయం ఏమిటంటే, డెల్టా ఆధునీకరణలో భాగంగా పాలకొల్లులో మురుగునీటి కాల్వకు కాంక్రీటు గోడలను కట్టాలన్నది కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్టును ఓ కంపెనీ దక్కించుకోగా పృధ్విరాజ్ అనే కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టు తీసుకుని పనులు మొదలుపెట్టారు. గోడ కట్టే పనితో పాటు బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తిచేయాలి. ఒకవైపు గోడ నిర్మాణం జరుగుతుండగానే బ్రిడ్జి నిర్మాణాన్ని కాంట్రాక్టర్ పూర్తి చేసి రూ. 60 లక్షలకు బిల్లు పెట్టారు. బిల్లు పెట్టి ఎంతకాలమైనా మంజూరు కాకపోవటంతో కాంట్రాక్టర్ కు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అధికారులు ఎంఎల్ఏని కలవమని సలహా ఇచ్చారు.
కాంట్రాక్టర్ ను నిర్భందించిన ఎంఎల్ఏ
ఎంఎల్ఏ రామానాయుడును కాంట్రాక్టర్ కలిస్తే మొత్తం పనిలో 10 శాతం కమీషన్ అడిగారట. అయితే, 5 శాతం ఇవ్వటానికి కాంట్రాక్టర్ అంగీకరించారు. ఎంఎల్ఏ మాత్రం పది శాతం ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టారు. కమీషన్ సమస్య వీరిద్దరి మధ్య సమస్య కొలిక్కి రాకముందే పోలీసులు జోక్యం చేసుకున్నారు. సిఐ కృష్ణకుమార్ కాంట్రాక్టర్ ను స్టేషన్ కు పిలిపించి నిర్భందించారు. దాంతో విషయం రాజకీయమై చివరకు వైసిపి నేతలు కూడా జోక్యం చేసుకోవటంతో విషయం కాస్త రచ్చకెక్కింది.
ఎంఎల్ఏపై ఎస్పీకి కాంట్రాక్టర్ ఫిర్యాదు
విషయం రచ్చకెక్కటంతో వేరే దారిలేక పోలీసులు కాంట్రాక్టర్ ను వదిలిపెట్టారు. దాంతో కాంట్రాక్టర్ వెంటనే జిల్లా ఎస్పీని కలిసి సిఐ కృష్ణకుమార్, ఎంఎల్ఏ రామానాయుడుపై ఫిర్యాదు చేయటం జిల్లాలో సంచలనంగా మారింది. ఇటువంటి ఘటనలు ఒక్క పాలకొల్లుకు మాత్రమే పరిమితం కాలేదు. కాకపోతే బయటపడింది పాలకొల్లులో మాత్రమే. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ? అందుకే ఎంఎల్ఏల్లో చాలామంది కాంట్రాక్టర్ల మీదే పడ్డారు.
ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలు
తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రతీ పనిలోనూ కాంట్రాక్టర్లను పట్టి పీడిస్తున్నట్లు చాలామంది ఎంఎల్ఏలపై ఆరోపణలు వినబడుతున్నాయి. వసూళ్ళల్లో కూడా మళ్ళీ రెండు రకాలు. మొదటిదేమో టిక్కెట్లు వస్తుందన్న నమ్మకం ఉన్న ఎంఎల్ఏలేమో వచ్చే ఎన్నికల్లో పెట్టాల్సిన ఖర్చుల కోసం వసూళ్ళు చేస్తున్నారు. టిక్కెట్లు రాదన్న అనుమానం ఉన్న ఎంఎల్ఏలేమో ఇదే చివరి అవకాశం అన్నట్లుగా వసూళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇస్తున్న ర్యాంకులు ఎంఎల్ఏల పనితీరుకా లేకపోతే చేస్తున్న వసూళ్ళకా అనే సెటైర్లు ఎక్కువైపోయాయి.