అన్న చిరంజీవి రూట్లోనే తమ్ముడు జనసేన అధినేత పవన్ వెళ్తున్నారా..? కులాలకు అతీతంగా పార్టీని నడిపిస్తానని పైకి పవన్ చెబుతున్నా.. లోలోపల మాత్రం కులగణన చేపడుతున్నారా..? కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించడానికి ఇదే కారణమా..? అంటే తాజా పరిస్థితులు మాత్రం నిజమేనని అంటున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా సహజంగానే ఇతర పార్టీల్లో ఉన్న కాపు సామాజికవర్గం నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. కొందరు నేతలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉండలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో మళ్లీ ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే.. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల నేపథ్యంలో పవన్కల్యాణ్ చేరికలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీని కులసమీకరణాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా నడిపిస్తానని ఆయన చెబుతున్నారు. అంతేగాకుండా పాత కాపులకు, నాయకులకు జనసేన అవకాశం లేదనీ, అంతా కొత్తవారితోనే పార్టీ నిర్మిస్తానని కూడా ఆయన అనేక సార్లు చెప్పారు. కానీ.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. విశాఖలో పలువురు టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నేతలు జనసేనలో చేరడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇతర పార్టీల్లోనే కాపు నేతలపై సహజంగానే జనసేనలో చేరాలన్న ఒత్తిడి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు, గంటా శ్రీనివాసరావులు అందులో చేరారు.
నిజానికి.. గుంటూరు, విజయవాడ, రాయలసీమ ప్రాంతంపై దృష్టి పెట్టకుండా.. కేవలం సొంత సామాజికవర్గం బలంగా ఉన్న విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపైనే పవన్ కల్యాణ్ దృష్టి సారిస్తే.. ప్రజారాజ్యం ఫలితాలే వస్తాయని పలువురు నాయకులు అంటున్నారు. ఈ రెండు ప్రాంతాలపైనే ఆధారపడుతూ పర్యటిస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ బరిలోకి దిగుతామని పవన్ చెప్పడంలో ఆంతర్యమేమిటన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు. వైసీపీతో కలిసి పోటీ చేసి టీడీపీని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పవన్ ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభించి ఇంకా అక్కడే తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తన సామాజికవర్గం నేతలతో పాటు ప్రజారాజ్యం పాత కాపులు అందరూ జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక రాజకీయంగా వెటరన్ లీడర్లుగా ఉన్నవారిని పవన్ స్వయంగా కలుస్తున్నారు. ఈ లెక్కన చూస్తుంటే పవన్ పార్టీ పాత కాపుల పార్టీగాను, కుల పార్టీగానే ముద్రవేయించుకునే ప్రమాదంలో పడిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలు పవన్కు నష్టం చేస్తుందా..? లేక లాభం చేస్తుందా..? అన్నది స్పష్టంగా చెప్పాలంటే కొంత కష్టంగానే కనిపిస్తోంది.